ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ తీరం వైపు 'మొంథా' తుఫాన్.. 160 కి.మీ దూరంలో కేంద్రీకృతం, హై అలర్ట్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 03:02 PM

ఆంధ్రప్రదేశ్ తీరంపై 'మొంథా' తుఫాను తీవ్ర ప్రభావం చూపనుంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తాజాగా ప్రకటించింది. దీని కదలికపై గడిచిన 6 గంటల నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. తుఫాను వేగం పెరిగే అవకాశం ఉండటంతో తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.
ప్రస్తుతానికి 'మొంథా' తుఫాన్ మచిలీపట్నానికి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాకినాడకు 240 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు APSDMA వెల్లడించింది. తుఫాను ప్రభావం తీర జిల్లాలపై అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తుఫాను కదలిక, ప్రభావాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, అన్ని జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల భద్రతకు పెద్ద పీట వేస్తూ, అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.
తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA ముఖ్యంగా సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, అపాయకర ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత శిబిరాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సూచనలను, వార్తలను అనుసరిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు విన్నవించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa