దేశ రాజధాని ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించే ‘క్లౌడ్ సీడింగ్’ ప్రక్రియను విజయవతంగా పూర్తి చేశారు. ఐఐటీ కాన్పూర్ నుంచి బయల్దేరిన విమానం.. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లాంటి రసాయన ఉత్ప్రేరకాలను మేఘాలపై చల్లింది. బురారి, ఉత్తర కరోల్ బాగ్, బోజ్పుర్, మయూర్ విహార్, సదక్పుర్ ప్రాంతాల్లో ఈ క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ తర్వాత కొన్ని గంటల్లో వర్షం పడనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వాతావరణంలో తేమ 50 శాతం ఉంటేనే వర్షాలను ప్రేరేపించవచ్చు. 20 శాతం కన్నా తక్కువ తేమ ఉంటే వర్షాలు కురవడం కష్టం అవుతుంది.
సాధారణంగా కరువు లాంటి పరిస్థితులు నెలకొంటే.. కృత్రిమ వర్షం కురిపిస్తారు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఢిల్లీని తీవ్ర వాయు కాలుష్యం వేధిస్తోంది. దీపావళి అనంతరం పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. మంగళవారం (అక్టోబర్ 28) దిల్లీలో వాయు నాణ్యత సూచీ 306గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) తెలిపింది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య కేటగిరిలోకి వస్తుందని వెల్లడించింది. ఇటీవల ప్రపంచంలో అత్యంత దారుణమైన వాయు నాణ్యత ఉన్న నగరంగా ఢిల్లీ నిలిచింది. గత కొన్నేళ్లుగా ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. చలికాలం వచ్చదంటే.. రోజు రోజు గాలి నాణ్యత దిగజారుతోంది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికంగా కృత్రిమ వర్షం కురిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇటీవల ఢిల్లీ సీఎం రేఖ గుప్తా క్లౌడ్ సీడింగ్ గురించి మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో క్లౌడ్ సీడింగ్ తప్ప తమ వద్ద వేరే మార్గం లేదన్నారు. దీని వల్ల కాలుష్యం తగ్గుతుందో లేదో చూడాలని చెప్పారు. ఢిల్లీ ప్రజల ఆశీస్సులు తమ ప్రభుత్వం వెంట ఉన్నాయన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రయోగాలు విజయవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నగరంలో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఐఐటీ కాన్పూర్తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం.. అక్టోబర్ 1 నవంబర్ 30 మధ్య ఎప్పుడైనా ట్రయల్స్ నిర్వహించడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతిచ్చింది. ఈ ప్రక్రియను నిర్వహించడానికి కావాల్సిన రూ.3.21 కోట్ల బడ్జెట్కు ఢిల్లీ కేబినెట్ మేలో ఆమోదం తెలిపింది. ప్రతికూల వాతావరణం వల్ల ఆలస్యమైన క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్.. ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa