అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజు లక్ష డాలర్లకు పెంపు. అమెరికన్ ఉద్యోగ మార్కెట్ షేక్ అవుతోంది. ఈ ఫీజు భారాన్ని మోయలేక, కాగ్నిజెంట్ , టీసీఎస్ , ఇంట్యూటివ్ సర్జికల్, వాల్మార్ట్ వంటి నాలుగు దిగ్గజ కంపెనీలు H-1B వీసా స్పాన్సర్షిప్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నిర్ణయం టెక్ ప్రపంచంలో "అమెరికన్ ఫస్ట్" విధానం ఎంత బలంగా అమలు అవుతుందో స్పష్టం చేస్తోంది. H-1B వీసా విధానాన్ని దుర్వినియోగం అరికట్టడానికి, స్థానిక ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ కొత్త ఫీజును ప్రవేశపెట్టినట్లు ట్రంప్ యంత్రాంగం వాదిస్తోంది. కానీ, పరిశ్రమ యాజమాన్యాలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు దీనిని ఆవిష్కరణలకు అడ్డుగోడగా అభివర్ణిస్తున్నారు.
ఇక, హెచ్-1 బీ వీసా లక్ష డాలర్లు ఫీజు అనేది ఒక ఉద్యోగిని నియమించుకోవడానికి కంపెనీకి తలకుమించిన భారంగా మారింది. ఈ భారీ ఖర్చుల వల్ల, కాగ్నిజెంట్ వంటి దిగ్గజాలు తమ ఉద్యోగులుగా ‘ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేని’ అభ్యర్థులను మాత్రమే కోరుకుంటున్నాయి. అంటే, భారతీయ ప్రతిభకు తలుపు మూసుకుపోయినట్టే! అంతర్జాతీయంగా H-1B స్పాన్సర్స్లో అగ్రస్థానంలో ఉండే ఇండియన్ ఐటీ దిగ్గజం టీసీఎస్ సైతం ఈ ప్రోగ్రామ్ ద్వారా కొత్త నియామకాలను నిలిపివేసింది. టీసీఎస్ CEO కృతివాసన్ ప్రకారం.. కంపెనీ ఇప్పటికే యూఎస్ వర్క్ఫోర్స్ను గణనీయంగా లోకలైజ్ చేసింది. అంటే, అమెరికాలోని ఉద్యోగాలకు స్థానిక అమెరికన్లనే ఎక్కువగా నియమించుకుంటోంది.
మరోవైపు, రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ కూడా అదే బాట పట్టింది. ఇది టెక్ దిగ్గజాలకే పరిమితం కాకుండా, ఇతర రంగాల్లోని పెద్ద కంపెనీలు సైతం విదేశీ టాలెంట్ను నియమించుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నాయనేందుకు నిదర్శనం. ఈ నాలుగు కంపెనీలు వెనక్కి తగ్గడం వల్ల అమెరికా యూనివర్సిటీల్లో చదువుతున్న భారతీయ STEM గ్రాడ్యుయేట్లు, ఇతర భారతీయ నిపుణులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త ఫీజు ప్రభావం వల్ల, ఉద్యోగాన్ని, వీసా స్పాన్సర్షిప్ను సాధించే పోటీ భయంకరంగా పెరిగింది.
అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఇప్పటికే 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన H-1B వీసా క్యాప్ను (సాధారణ, అడ్వాన్స్డ్ డిగ్రీ కోటా) చేరుకుందని వార్తలు వచ్చాయి. దీని అర్థం: తక్కువ వీసాలు, ఎక్కువ పోటీ. వీసా స్పాన్సర్షిప్ లేకపోతే, అమెరికాలో ఉండి పనిచేయాలనే వారి కలలు అసంపూర్ణంగానే మిగిలిపోతాయి. ఈ ఫీజు పెంపుతో ఆవిష్కరణలు దెబ్బతింటాయని టెక్, విద్యారంగాల నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ, ట్రంప్ యంత్రాంగం వెనక్కి తగ్గడం లేదు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో, భారతీయ నిపుణులు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పరిశ్రమ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఇకపై రిమోట్ వర్క్ అవకాశాలు, ఇండియా లేదా యూరప్లోని గ్లోబల్ డెలివరీ సెంటర్లలో డిమాండ్ పెరుగుతుంది. అమెరికాలో అడుగు పెట్టాలనుకునే వారు H-1B వీసాపైనే కాకుండా, ఇతర దేశాల అవకాశాలు, ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ వంటి మార్గాలను కూడా అన్వేషించడం తెలివైన నిర్ణయం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa