ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 08:41 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచార వేగాన్ని పెంచారు. బుధవారం నాడు ముజఫర్‌పూర్‌లోని సక్రా నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి ప్రజల బాధల కన్నా ఓట్లే ముఖ్యమని ఆయన ఆరోపించారు.వర్షంలోనూ ప్రసంగాన్ని కొనసాగించిన రాహుల్ గాంధీ, "నరేంద్ర మోదీకి ఓట్లు తప్ప మరేదీ పట్టదు. మీరు ఓటు వేస్తామని చెప్పండి, ఆయన వేదికపై డ్యాన్స్ చేయమన్నా చేస్తారు. ఓట్లు పొందడానికి ఆయన ఏదైనా చేయగలరు" అని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రధాని మోదీ మతపరమైన మనోభావాలను వాడుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. "ఛఠ్ పూజ సమయంలో ప్రజలు యమునా నదిలో స్నానాలు చేస్తూ పూజలు చేస్తుంటే, మోదీ మాత్రం తన కోసం ప్రత్యేకంగా నిర్మించుకున్న స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశారు. దీన్నిబట్టి బీహార్ ప్రజల విశ్వాసాలతో ఆయనకు సంబంధం లేదని, కేవలం మీ ఓట్లు మాత్రమే కావాలని స్పష్టమవుతోంది" అని విమర్శించారు.ప్రధాని మోదీ పేదల కోసం కాకుండా పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. "ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ రైతులు లేదా పేదలతో కనిపించరు. ఆయన చిన్న పరిశ్రమలను నాశనం చేసి, కేవలం పారిశ్రామికవేత్తలకే లబ్ధి చేకూరుస్తున్నారు. మా కల 'మేడ్ ఇన్ చైనా' కాదు, 'మేడ్ ఇన్ బీహార్' వస్తువులను చూడటం" అని అన్నారు.ఈ సభలో రాహుల్ గాంధీతో పాటు మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, వికాశ్‌శీల్ ఇన్సాన్ పార్టీఅధినేత ముఖేశ్ సహానీ కూడా పాల్గొన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాలను మోసం చేసిన ఎన్డీయే 'డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని' కూకటివేళ్లతో పెకలించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బీహార్‌లో విద్య, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని రాహుల్ అన్నారు. "బీహార్‌లో విద్యకు అర్థం లేకుండా పోయింది. పేపర్ లీక్‌లు కష్టపడి చదివిన యువత భవిష్యత్తును నాశనం చేశాయి. బీహారీలు అప్పులు చేసి విద్య, ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సి వస్తోంది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఫ్లైఓవర్ కింద వారు బతుకు పోరాటం చేయడం మనం చూడవచ్చు," అని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు."మేం కులగణన డిమాండ్ చేశాం, కానీ మోదీ, బీజేపీ మౌనంగా ఉన్నాయి. వారు సామాజిక న్యాయానికి వ్యతిరేకం. నితీశ్ కుమార్ పూర్తిగా బీజేపీ నియంత్రణలో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది. మేం ప్రతి కులానికి, ప్రతి మతానికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఐదేళ్లలో బిహార్‌లో దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం" అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa