ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారు లేని అబ్బాయికి ఎవరూ పిల్లను ఇవ్వడం లేదు.. డిప్యూటీ సీఎం

national |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 08:51 PM

బెంగళూరులోని ప్రతిపాదిత టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్‌పై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. బెంగళూరు ట్రాఫిక్ సమస్యలపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యతో జరిగిన చర్చలో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కారు లేని అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా ప్రజలు వెనుకాడతారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన తేజస్వీ సూర్య.. టన్నెల్ రోడ్డు నిర్మించడం వెనుక అసలు ఉద్దేశం ట్రాఫిక్ తగ్గింపు కాదని.. కారు కంపెనీలకు సంబంధించిన సామాజిక సమస్యను పరిష్కరించడమేనని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ప్రాజెక్ట్‌పై రాజకీయ విమర్శలను మరింత పెంచాయి.


బెంగళూరులో ప్రతిపాదిత మల్టీ కోర్ టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్‌పై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన ఓ వివాదాస్పద వ్యాఖ్య ఇప్పుడు ఆ నగరంలో పెద్ద రాజకీయ దుమారాన్ని సృష్టించింది. బెంగళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు తేజస్వీ సూర్యతో జరిగిన చర్చలో శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం కనుగొనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించారు.


రూ.వేల కోట్ల వ్యయంతో నిర్మించాలని భావిస్తున్న 'కార్-ఓన్లీ' (కార్లకు మాత్రమే) టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్‌ను విరమించుకోవాలని.. ఎంపీ తేజస్వి సూర్య పేర్కొన్నారు. దానికి బదులు ప్రజా రవాణా వ్యవస్థ అయిన బెంగళూరు మెట్రోలో మరింత పెట్టుబడి పెట్టాలని గట్టిగా వాదించారు. ప్రజా రవాణాను ప్రోత్సహిస్తే ప్రజలు ప్రైవేట్ వాహనాలను వాడటం తగ్గిస్తారని తేజస్వీ సూర్య చేసిన వాదనలను ఖండించిన డీకే శివకుమార్.. దానికి కౌంటర్ ఇచ్చారు.


ప్రజలు తమ కుటుంబాలతో తమ సొంత వాహనాల్లో ప్రయాణించడానికి ఇష్టపడతారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో కారు లేని అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా అమ్మాయిలు ముందుకు రావడం లేదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు తేజస్వీ సూర్య వెంటనే తీవ్రంగా స్పందించారు. టన్నెల్ ప్రాజెక్ట్ నిర్మాణం.. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఉద్దేశించిందని తాను పొరపాటు పడ్డానని ఎద్దేవా చేశారు.


డీకే శివకుమార్ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే.. ఈ ప్రాజెక్ట్ ట్రాఫిక్ సమస్యకు కాకుండా పెళ్లిళ్లు, కార్ల కంపెనీలకు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి ఉద్దేశించబడిందని అర్థమైందని మండిపడ్డారు. దీనికి సంబంధించి డీకే శివకుమార్, తేజస్వీ సూర్య మధ్య జరిగిన వాదోపవాదాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బెంగళూరు నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌పై చర్చ మరింత తీవ్రమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa