గుజరాత్లో నిర్వహించిన 'రాష్ట్రీయ ఏక్తా దివస్' (జాతీయ ఐక్యతా దినోత్సవం) వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, కాశ్మీర్ సమస్యకు, దేశంలో నెలకొన్న అశాంతికి కాంగ్రెస్ అనుసరించిన బలహీన విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. పాక్ ఆక్రమణకు గురైన కశ్మీర్తో పాటు దేశంలోని అశాంతికి గత ప్రభుత్వాల వైఖరి పరోక్షంగా దారితీసిందని ఆయన స్పష్టం చేశారు.
స్వాతంత్ర్యం తర్వాత జమ్మూ కశ్మీర్ను భారత్లో పూర్తిగా విలీనం చేయాలన్న సర్దార్ పటేల్ ఆకాంక్షను నాటి ప్రధాని నెహ్రూ గౌరవించలేకపోయారని మోదీ ధ్వజమెత్తారు. పటేల్ దూరదృష్టిని విస్మరించి, కశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగాన్ని, ప్రత్యేక జెండాను ఇచ్చి విభజన బీజాలు వేశారని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయాలే దశాబ్దాల పాటు దేశాన్ని హింస, ఉగ్రవాదాల మంటల్లోకి నెట్టాయని, దేశ సమగ్రతకు ముప్పు కలిగించాయని ప్రధాని నొక్కి చెప్పారు.
సర్దార్ పటేల్ దేశ సార్వభౌమత్వానికి, ఏకీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ గొప్ప ఆశయాలను విస్మరించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ చేసిన చారిత్రక తప్పిదం కారణంగానే ఆ ప్రాంతం పాక్ ఆక్రమణకు గురైందని, ఉగ్రవాదం పెరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కశ్మీర్ విషయంలోనే కాకుండా, వందేమాతరం గేయాన్ని బ్యాన్ చేయడానికి ప్రయత్నించడం వంటి చర్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి దేశ సమైక్యత పట్ల ఉన్న నిబద్ధతను ప్రశ్నార్థకం చేశాయని ఆయన విమర్శించారు.
ఏక్తా దివస్ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, సర్దార్ పటేల్ వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని, దేశ సమగ్రతకు భంగం కలిగించే ప్రతి ఆలోచనను, చర్యను పౌరులంతా తిరస్కరించాలని పిలుపునిచ్చారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ను దేశ మెయిన్ స్ట్రీమ్లోకి పూర్తిగా తీసుకొచ్చి, సర్దార్ పటేల్ కలలను తన ప్రభుత్వం సాకారం చేసిందని ఆయన అన్నారు. దేశ ఐక్యత, భద్రతకు ముప్పు కలిగించే ప్రతి అంశాన్ని తొలగించేందుకు దేశం కట్టుబడి ఉందని ప్రధాని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa