ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశీబుగ్గ తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం

national |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 09:31 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది భక్తులు మరణించారు. మృతి చెందిన వారిలో తొమ్మిది మంది మహిళలు, ఒక బాలుడు ఉండగా.. తాజాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేస్తూనే.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. అలాగే బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం కూడా ప్రకటించారు.


పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఉన్న ఈ చారిత్రక ఆలయానికి పవిత్రమైన ఏకాదశి రోజు కావడంతో ఉదయం నుంచే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఆలయంలోని రద్దీని నియంత్రించడంలో లోపాలు ఉండటం, ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రద్దీని తట్టుకోలేక క్యూ లైన్‌లో ఏర్పాటు చేసిన రెయిలింగ్ ఊడిపోవడం, ఓ భక్తుడు కిందపడటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీయడం, వెనుక ఉన్నవారు ముందు ఉన్నవారిపై పడటంతో ఈ తొక్కిసలాట సంభవించింది. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా హాహాకారాలతో నిండిపోయింది. మొత్తంగా 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


ఈ ప్రమాదంలో అనేక మంది భక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హుటాహుటిన పలాస ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అయితే ఈ ఘోర విషాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తనను కలచివేసిందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగానే మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. అతేకాకుండా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులను ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa