బీహార్ రాజకీయాలు ఎన్నికల వేళ మరింత వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఐదు రోజులే సమయం ఉండటంతో.. అధికార ఎన్డీయే కూటమితో సహా అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచార పర్వాన్ని ఉద్ధృతం చేశాయి. గెలుపే ఏకైక లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీఏ తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం సీఎంగా ఉన్న నితీష్ కుమార్ వయసు ఎక్కువ కావడంతో.. ఉపముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరికి బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనేక వార్తలు రాగా.. తాజాగా వాటిపై ఆయన స్పందించారు. నెక్స్ట్ సీఎం తాను కాదని.. ఆయనే అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. అయితే ఈసారి ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ను తప్పించి.. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి ఆ బాధ్యతలు అప్పగించవచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంటుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
ముఖ్యమంత్రి పీఠంపై జరుగుతున్న ఈ విస్తృత ప్రచారంపై సామ్రాట్ చౌదరి తాజాగా స్పందించారు. ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు.. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలపై వస్తున్న ప్రచారం గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఎలాంటి సంశయం లేకుండా బదులిస్తూ.. "ముఖ్యమంత్రి పదవికి ఖాళీ లేదు" అని తెలిపారు. అంతటితో ఆగకుండా.. నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని పునరుద్ఘాటించారు. బీహార్లో అభివృద్ధి పట్ల నితీష్ కుమార్ గారికి ఉన్న నిబద్ధత అందరికీ తెలిసిందే అని చెప్పారు. ఆయన నాయకత్వంలోనే గత కొన్నేళ్లుగా రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని వివరించారు. బీజేపీ పార్టీ తరఫున నితీష్ కుమార్ గారికే తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఎన్డీయే కూటమిలో నాయకత్వం విషయంలో ఎలాంటి గందరగోళం లేదని తేల్చి చెప్పారు.
నిజానికి 2020 ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా.. కేంద్ర నాయకత్వం బీహార్ ప్రయోజనాల దృష్ట్యా నితీష్ కుమార్ నేతృత్వానికే మద్దతు ఇచ్చింది. అదే సంప్రదాయాన్ని కూటమి గౌరవిస్తుందని సామ్రాట్ చౌదరి పరోక్షంగా తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు ఉండనుండగా.. ఉపముఖ్యమంత్రి ఈ విధమైన బహిరంగ ప్రకటన చేయడం వల్ల ఎన్డీయే కూటమి ఐక్యతపై సందేహాలు తొలగిపోయి, ఎన్నికల ప్రచారానికి మరింత బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa