ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమల కేసులో మరో అరెస్ట్.. ఈసారి అదుపులోకి తీసుకుంది బంగారాన్ని రాగిగా మార్చిన వ్యక్తినే

national |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 09:35 PM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలోని విగ్రహాల బంగారు తాపడంలో చోటుచేసుకున్న బరువు వ్యత్యాసం కేసు దర్యాప్తులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ భారీ మోసానికి ప్రధాన సూత్రధారి, పారిశ్రామికవేత్త ఉన్నికృష్ణన్‌ పొట్టికి సహకరించిన ఆరోపణలపై ట్రావెన్‌కోర్ దేవస్థానం (టీడీబీ) బోర్డు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుదేశ్ కుమార్‌ను గురువారం సాయంత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ముఖ్యంగా క్రైమ్ బ్రాంచ్ అధికారులు తిరువనంతపురంలో సుదేశ్ కుమార్‌ను విచారించిన అనంతరం ఈ అరెస్టు చేశారు. శనివారం అతడిని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు.


బంగారాన్ని రాగిగా మార్చిన మాజీ ఈవో..


శబరిమలలోని ద్వారపాలక విగ్రహాలకు బంగారు పూత పూసిన పొరలు ఉన్నాయని తెలిసినా.. సుదేశ్ కుమార్ వాటిని అధికారిక పత్రాలలో రాగితో చేసిన తాపడాలుగా తప్పుగా నమోదు చేశారు. దీని ద్వారా ప్రధాన నిందితుడు బంగారాన్ని దొంగిలించడానికి సహకరించారు. అంతేకాకుండా ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి ఐడీ కార్డులో పలు మార్పులు చేసి, బంగారాన్ని దొంగిలించడానికి ఆయన నేరుగా సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మరో నిందితుడు మురారి బాబుకు కూడా సుదేశ్ సహాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.


ఈ మొత్తం కుంభకోణానికి ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి. అతను 2004 నుంచి 2008 మధ్య శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా పని చేసినప్పుడే ఈ పసిడి రహస్యాన్ని తెలుసుకున్నాడు. ఆలయ ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన రాగి రేకులకు 1998లోనే బంగారు తాపడం వేశారు. కాలక్రమంలో బెంగళూరులో వ్యాపారిగా స్థిరపడిన ఉన్నికృష్ణన్.. ఈ బంగారు తాపడాలకు మెరుగులు దిద్దుతానని ఆలయ నిర్వాహకులకు ప్రతిపాదించాడు. దీంతో ఆలయ అధికారులు 2019లో ఆ పనిని అతడికి అప్పగించారు. ఉన్నికృష్ణన్ ఆ తాపడాలను చెన్నైలోని ఒక సంస్థకు తరలించి, వాటి నుంచి అత్యంత విలువైన బంగారాన్ని తొలగించి వేశాడు. ఆ తర్వాత వాటిని తిరిగి అమర్చినప్పటికీ.. తాపడాలపై ఉన్న బంగారం బరువు గణనీయంగా తగ్గిన విషయం ఆలస్యంగా బయటపడింది.


ఈ విషయంపై టీడీబీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మాజీ ఈవో సుదేశ్ కుమార్‌ను అరెస్ట్ చేసి కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో మరికొంతమంది ఆలయ అధికారుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. చూడాలి మరి ఇంకెంత మంది ఈ కేసులో దోషులుగా తేలుతారనేది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa