ఐటీ, టెక్ రంగంలో లేఆఫ్స్ కారణంగా గత కొన్ని నెలలుగా ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్న సంగతి తెలిసిందే. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో చెప్పలేని పరిస్థితులు. కరోనా మహమ్మారి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కారణాలతో ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ సైతం భారీగానే ఉద్యోగులను తొలగించింది. ఆ కంపెనీలో కొత్తగా చేరాలంటో ఉద్యోగానికి గ్యారెంటీ లేదనే మాట స్థాయికి వచ్చింది. అయితే, ఇకపై అలా ఉండదు. ఐటీ, టెక్ రంగంలోని వారు ఎగిరి గంతేసే మాట చెప్పారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల . త్వరలోనే తమ కంపెనీ భారీగా నియామకాలు చేపట్టనుందని వెల్లడించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దూసుకెళ్లడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ అతి త్వరలో నియామకాలు మొదలుపెడుతుందని ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. ఇన్నాళ్లు వివిధ విభాగాల్లో లేఆఫ్స్ చేపట్టిన ఈ కంపెనీ ఇప్పుడు ఏఐని దృష్టిలో పెట్టుకుని నియామకాలు ప్రారంభిస్తుండడం గమనార్హం. బీజీ2 పాడ్ కాస్ట్లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. భవిష్యత్తులో కంపెనీ విస్తరణ ఆటోమేషన్ ఆధారంగానే మరింత స్మార్ట్గా, వ్యూహాత్మకంగా ఉంటుందన్నారు. ప్రస్తుత మార్పులను గతంలో ఫ్యాక్స్ల నుంచి ఇ-మెయిల్స్, స్ప్రెడ్ షీట్లకు మారిన విప్లవంతో ఆయన పోల్చారు.
'మా కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెంచబోతున్నాం. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శకానికి ముందు ఉన్నట్లుగా మాత్రం ఉండదు. అంటే వచ్చే నియామకాలు ఏఐ ప్రభావాన్ని పెంచనున్నాయే తప్పా ప్రస్తుతం ఉన్న మాదిరిగా యాంత్రికంగా మాత్రం ఉండదు' అని సత్య నాదెళ్ల వెల్లడించారు. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్ హబ్ ఏఐ కోడింగ్ హెల్పర్ వంటి యాక్సెస్ ఇస్తామన్నారు. ఏఐ సాయంతో మరింత వేగంగా పని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన వెల్లడించారు.
దాదాపు ఏడాది నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో మార్పులు లేవు. 2022 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య ప్రతి సంవత్సరం 22 శాతం మేర పెరుగుతూ వచ్చింది. అయితే, ఈ ఏడాది 2025లో మాత్రం సుమారు 15000 మంది ఉద్యోగులను తొలగించారు. ఆ తర్వాత కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2 లక్షలకు పైగానే ఉంది. ఇప్పుడు మరిన్ని నియామకాలు చేపడతామని స్వయంగా సీఈఓనే వెల్లడించారు. అయితే, ఏఐపై మంచి పట్టు ఉన్న వారికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పవచ్చు. మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం కోసం చూసే వారికి ఇది మంచి అవకాశం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa