ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడ జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతపై అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 07:24 PM

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో, కాకినాడ జిల్లా పరిధిలోని పుణ్యక్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. క్యూ లైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.సోమవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించి, పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం, అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయాలకు కార్తీక మాసంలో భక్తులు భారీ సంఖ్యలో వస్తారని, ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కాశీబుగ్గ ఘటనను దృష్టిలో ఉంచుకొని దేవాదాయ శాఖ ఆలయాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాలతో పాటు ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాల జాబితాను కూడా సిద్ధం చేసి, వాటి వద్ద రద్దీని పర్యవేక్షించాలి" అని అధికారులను ఆదేశించారు. ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి ఉన్నందున ఆ రోజు, ఆ తర్వాత రోజుల్లో రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసుకోవాలన్నారు. ముఖ్యంగా శని, ఆది, సోమవారాల్లో భక్తుల సంఖ్య భారీగా ఉంటుందని తెలిపారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. "భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. ఆలయ పరిసరాలు, క్యూ లైన్ల వద్ద సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉండాలి. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పారిశుధ్యాన్ని కాపాడాలి. రద్దీకి తగినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలి. ఆలయాల సమీపంలోని జాతీయ రహదారులపై ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ ప్రమాదాలు జరగకుండా చూడాలి. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలి" అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa