సంఘటిత రంగంలో పని చేస్తున్న వారందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి తీసుకొచ్చి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక ఉపాధి మంతిత్వ శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయా తెలిపారు. అదే ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ స్కీమ్ 2025. కంపెనీ యాజమాన్యాలు స్వచ్ఛందంగా అర్హులైన ఉద్యోగులను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో నమోదు చేసేలా ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ కొత్త పథకం ఇప్పటికే నవంబర్ 1, 2025 నుంచే అమలులోకి వచ్చింది.
ఈ కొత్త పథకం కింద అర్హులైన ఉద్యోగులను ఈపీఎఫ్ఓలో నమోదు చేయడంతో పాటుగా యాజమాన్యాలు గతంలో ఉద్యోగి వాటా భాగస్వామ్యాన్ని జమ చేయకపోయినా దాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకు బదులుగా రూ.100 నామమాత్రపు పెనాల్టీ కడితే సరిపోతుంది. కార్మిక ఉపాధి శాఖ ప్రకారం ఈ స్కీమ్ శ్రామిక శక్తిని వ్యవస్థీకృతం చేయడంతో పాటు వ్యపారం చేయడం సులభతరం చేయడంలో సాయపడుతుంది. ఈపీఎఫ్ఓ అంటే ఒక నిధి మాత్రమే కాదని, సామాజిక ఆర్థిక భద్రతకు భారతీయ కార్మికులు ఉంచిన నమ్మకానికి ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓలో చేపడుతున్న సంస్కరణల్లో సామర్థ్యం, పారదర్శకత, సామనభూతి అనే మూడు అంశాలు చోదక శక్తులుగా ఉండాలన్నారు.
ఈ కొత్త పథకం, సామాజిక భద్రతా పరిధిలోకి రాని అర్హులైన ఉద్యోగులను స్వచ్ఛందంగా నమోదు చేసుకునేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం EPF కవరేజ్ లేని అర్హులైన ఉద్యోగులను నమోదు చేసుకోవడానికి, గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకోవడానికి కంపెనీల యాజమాన్యాలను ప్రోత్సహించడం. ఈ స్కీమ్ నవంబర్ 1, 2025న ప్రారంభమవగా 2026, ఏప్రిల్ 30 వరకు అందుబాటులోఉంటుంది. 2017, జూలై 1 నుంచి 2025, అక్టోబర్ 31 మధ్యలో ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ కవరేజీ లేని ఉద్యోగులు అర్హులు. ఈ కొత్త స్కీమ్ ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుంది.
ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ కవరేజీ ఉన్నా లేకపోయినా అన్ని సంస్థలూ ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేయవచ్చు. కంపెనీలు ప్రతి ఉద్యోగికి ఉమాంగ్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారిత యూఏఎన్ జనరేట్ చేయాలి. అలాగే ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ ద్వారా విరాళాలు చెల్లించాలి. గతంలో ఉద్యోగి వాట మినహాయించకపోతే ఈ స్కీమ్ కింద ఆ వాటాను మినహాయిస్తారు. అంటే ఉద్యోగి ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. అలాగే యజమాని కేవలం యజమాని వాటా, దానిపై వడ్డీ, అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు, నామమాత్రపు జరిమానా మాత్రమే చెల్లించాలి.
సాధారణంగా ఈపీఎఫ్ నింబంధనల ఉల్లంఘనలకు భారీగా జరిమానా విధిస్తారు. కానీ, ఈ కొత్త స్కీమ్ సమయంలో ఆలస్యం లేదా నమోదు చేయడానికి కేవలం ఒకసారి రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఇది మూడు ఈపీఎఫ్ పథకాలకు కలిపి వర్తిస్తుంది. సెక్షన్ 7ఏ కింద లేద ఇతర నిబంధనల కింద దర్యాప్తు ఎదుర్కొంటున్న సంస్థలకు సైతం ఈ పథకంలో పాల్గొనేందుకు అర్హత ఉంటుంది. వారికి సైతం జరిమానా రూ.100 మాత్రమే. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఈ పథకం కింద నమోదు చేసుకున్న లేదా ఉద్యోగులను ప్రకటించిన యజమానులు, ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన (PM-VBRY) కింద ప్రయోజనాలను పొందడానికి కూడా అర్హులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa