ఆమె ఒక బాధ్యత గల పంతులమ్మ.. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి.. వారి బంగారు భవితను తీర్చిదిద్దాల్సిన వ్యక్తి. తరగతిలో పాఠాలు బోధించి.. విద్యార్థులలో జ్ఞానాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. కానీ.. ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తరగతి గదిలో వారితో కాళ్లు పట్టించుకుంది ఆ టీచర్. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలో ఉన్న బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది.వై. సుజాత అనే మహిళ బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. అయితే సుజాత విద్యార్థులతో తరగతి గదిలో కాళ్లు పట్టించుకున్న ఫోటో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఉపాధ్యాయురాలు ఓ వైపు ఫోన్ మాట్లాడుతుంటే.. ఇద్దరు విద్యార్థినులు ఆమె కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజనం భిన్నరకాలుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సదరు టీచర్ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వరకూ చేరింది. దీంతో ఐటీడీఏ సీతంపేట పీవో.. ఆ ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టీచర్ తీరుపై విచారణకు ఆదేశించారు.
అయితే తనకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయని.. చాలా రోజులుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నానని సదరు టీచర్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఘటన జరిగిన రోజు నడుస్తూ జారిపడ్డానని.. విద్యార్థినులు తనకు సహాయం చేశారని ఆమె చెప్పినట్లు తెలిసింది. వాస్తవాన్ని వక్రీకరించేలా ప్రచారం చేశారని అధికారులకు టీచర్ సమాదానం ఇచ్చినట్లు తెలిసింది.
అయితే ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన అధికారులు.. నిజానిజాలు తేలేవరకూ సదరు టీచర్ను సస్పెండ్ చేశారు. హెచ్ఎం సుజాత తీరుపైన అక్టోబర్ 23వ తేదీన సీతంపేట ఐటీడీవో పీవోకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్ 24వ తేదీన ఛార్జ్ మెమో ఇచ్చారు. అయితే అక్టోబర్ నాలుగో తేదీన వార్తా పత్రికలలో వార్త రావటంతో.. సుజాతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు సస్పెన్షన్ కాలంలో ఆమె హెడ్ క్వార్టర్స్లో ఉండాలని.. అనుమతి లేకుండా అక్కడి నుంచి వెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa