ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనస్థీషియా ఇచ్చి భార్యను చంపిన డాక్టర్

Crime |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 07:39 PM

 బెంగళూరు డాక్టర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి జీఎస్.. చర్మవ్యాధి నిపుణురాలైన తన భార్య డాక్టర్ కృతిక ఎమ్ రెడ్డిని అనస్థీషియా డ్రగ్‌తో హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ హత్య జరిగిన కొన్ని వారాల తర్వాత ఆయన నలుగురు నుంచి ఐదుగురు మహిళలకు ఓ భయంకరమైన సందేశాన్ని పంపినట్లు దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా వారందరికీ ఆయన.. నీ కోసమే నా భార్యను చంపానంటూ మెసేజీలు పంపించినట్లు గుర్తించారు.


నీ కోసమే నా భార్యను చంపానంటూ మెసేజీ..


నిందితుడు మహేంద్ర రెడ్డి.. నీకోసమే నా భార్యను చంపాను" (I killed my wife for you) అనే సందేశాన్ని సాధారణ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కాకుండా ఫోన్‌పే వంటి డిజిటల్ చెల్లింపు యాప్‌లోని ట్రాన్సాక్షన్ నోట్స్ విభాగం ద్వారా పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందేశాన్ని అందుకున్న వారిలో గతంలో మహేంద్ర రెడ్డి ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిన ఒక మెడికల్ ప్రొఫెషనల్ కూడా ఉన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న అతడి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ డేటాను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) వాటిని పరిశీలించగా ఈ సంచలనాత్మక మెసేజ్‌లు బయటపడ్డాయి. భార్య మరణం తర్వాత పాత సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి మహేంద్ర నిస్సహాయంగా ప్రయత్నించినట్లు దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు.


  విక్టోరియా ఆసుపత్రిలో పనిచేసే మహేంద్ర రెడ్డి.. తన భార్య కృతికను ఇదే ఏడాది ఏప్రిల్ 23న హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కృతిక అనారోగ్యంతో మారతహళ్లిలోని తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు.. మహేంద్ర ఆమెకు చికిత్స పేరుతో రెండు రోజుల పాటు ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇచ్చాడు. చివరకు ఆపరేషన్ థియేటర్‌లకు మాత్రమే పరిమితమైన 'ప్రొపొఫాల్' (Propofol) అనే అనస్థీషియా డ్రగ్‌ను కూడా ఇచ్చాడు. అయితే దీన్ని అధిక మోతాదులో ఇవ్వడం వల్లే ఆమె మరణించినట్లు ఆరు నెలల తర్వాత వచ్చిన FSL నివేదిక ధృవీకరించింది. ముఖ్యంగా ఈమె మరణాన్ని మొదట్లో అంతా సహజ మరణంగానే భావించారు. కానీ కృతిక సోదరి డాక్టర్ నిఖిత ఎమ్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


కేసు దర్యాప్తులో మహేంద్ర రెడ్డి కుటుంబానికి ఉన్న క్రిమినల్ నేపథ్యం కూడా బయటపడింది. మహేంద్ర కవల సోదరుడు డాక్టర్ నాగేంద్ర రెడ్డి జీఎస్ పైనా గతంలో పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా మహేంద్ర మరో సోదరుడు రాఘవ రెడ్డి జీఎస్ కూడా 2023లో ఒక బెదిరింపు కేసులో సహ-నిందితులుగా ఉన్నారు. పెళ్లి సమయంలో ఈ వివరాలన్నీ తమ కుటుంబం నుంచి దాచారని కృతిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను చంపిన అల్లుడికి కఠిన శిక్ష పడేలా చేయాలని కోరుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa