ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘బిహార్‌లో ఓటు వేశాను.. ఇక మీ వంతు’.. ఒక్క సెల్ఫీతో కాంగ్రెస్, బీజేపీల మధ్య చిచ్చు పెట్టిన మహిళ

national |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 07:42 PM

ఆమె ఓ న్యాయవాది.. పేరు ఊర్మి. తాజాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సందర్భంగా ఓటు వేసింది. ఆ తర్వాత నేను బిహార్‌లో ఓటు వేశాను.. ఇప్పుడు మీ వంతు అంటూ ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్త వివాదాన్ని రాజేసింది. ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి. అరే ఓటు వేశానంటూ ఫొటో పోస్ట్ చేయడం అంత పెద్ద నేరమా.. ఇందులో వివాదం ఏముంది అని ఆలోచిస్తున్నారా.. అక్కడే ఉంది ట్విస్ట్.. సదరు మహిళది పుణె. ఆమె బిహార్‌లో ఓటు వేశానంటూ సెల్ఫీ పోస్ట్ చేసింది. ఇది బీజేపీ ఓట్ చోరీకి నిదర్శనం అంటూ కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తుంది. అసలేం జరిగింది అంటే..


బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ సందర్భంగా పుణెకు చెందిన మహిళా న్యాయవాది ఊర్మి సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన సెల్ఫీ కాస్త వివాదాన్ని రాజేసింది. ఈ పోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ ఆరోపణలకు ఆజ్యం పోసింది. సదరు మహిళా న్యాయవాది తన చేతి వేలికి ఉన్న సిరాను చూపుతూ.. నేను మోదీ కోసం ఓటు వేశాను.. బిహార్ ప్రజలు కూడా ఓటు వేయాలంటూ ఓ సెల్ఫీని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఇది కాస్త వివాదాస్పదంగా మారింది.


ఈ పోస్ట్ చూసిన వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆమె పాత ఫొటోల కోసం నెట్టింట గాలింపు మొదలు పెట్టారు. చివరకు సదరు మహిళా న్యాయవాది.. గతంలో పుణెలో ఓటు వేసినప్పుడు పోస్ట్ చేసిన సెల్ఫీని తవ్వి తీసి.. పుణె మహిళ బిహార్‌లో ఎలా ఎటు వేసిందంటూ ప్రశ్నిస్తున్నారు. బీబేపీ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఓటర్లను తరలిస్తోంది అనడానికి ఇదే నిదర్శనం అంటూ మండిపడుతున్నారు. తన సెల్ఫీ దేశ రాజకీయాల్లో చిచ్చు రాజేయడంతో ఊర్మి దీనిపై స్పందించారు.


తాను బిహార్‌ ఓటర్లను ఓటు వేసేలా ప్రేరేపించడం కోసం మాత్రమే ఎక్స్‌లో సెల్ఫీ పోస్ట్ చేశానని.. తాను బిహార్‌లో ఓటు వేయలేదని ఊర్మి చెప్పుకొచ్చారు. కానీ ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ రేష్మ అలమ్‌ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో వోటింగ్‌ అనేది బీజేపీకి కొత్త స్టార్టప్‌ మాత్రమే కాదు.. నూతన పెట్టుబడి దారు కూడా అంటూ ఎక్స్‌ వేదికగా విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలో ఓటు వేసిన ఊర్మి.. ఇప్పుడు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసింది.. ఇది ఓట్‌ చోరీ కాక మరేంటని.. మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేత అతుల్‌ లోందే పాటిల్‌ కూడా మండి పడ్డారు. అయితే ఈ వివాదంపై ఎన్నికల సంఘం స్పందిచాల్సి ఉంది.


ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓటు చోరీ అంశంపై స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. బ్రెజిలియన్‌ మోడల్‌ ఫోటోతో హర్యానాలో పదుల సంఖ్యలో ఓట్లు ఉన్నాయంటూ రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా పుణె న్యాయవాది సెల్ఫీ వైరల్ కావడంతో.. ఎన్నికల పారదర్శకతకు సంబంధించి అనేక అనుమానాలకు తావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa