ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 ప్రపంచకప్‌ 2026కి ముందు ఆఖరిసారి ఆసీస్‌తో భారత్ మ్యాచ్‌

sports |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 10:25 PM

టీ20 ప్రపంచకప్‌ 2026కి ముందు ఆఖరిసారి ఆసీస్‌తో భారత్ మ్యాచ్‌.. ఇవాళ గెలిస్తే సిరీస్ మనదే..!(ఫోటోలు- Samayam Telugu)


ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు చివరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికీ టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఇవాళ జరిగే చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను పట్టేయాలని పట్టుదలతో ఉంది. గబ్బా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా భారత జట్టు ఆస్ట్రేలియాలో గత 17 ఏళ్లలో ఒక్కసారి కూడా టీ20 సిరీస్ కోల్పోలేదు. ఈ సారి కూడా ఇప్పటికీ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. సిరీస్ కోల్పోయే అవకాశం లేదు. కానీ గెలిస్తే మాత్రం 3-1తో సిరీస్‌ కైవసం అవుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45కి మ్యాచ్ ప్రారంభం కానుంది.


ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షార్పణం కాగా.. మిగతా మూడులో భారత్‌ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్త వేదికల్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీకి ముందు భారత్.. ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌లో తలపడనుండటం ఇదే ఆఖరిసారి కావడం గమనార్హం.


ఇక ఈ సిరీస్‌లో భారత్.. బౌలింగ్‌లో సత్తాచాటుతున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం ఆశించిమేర రాణించలేకపోతోంది. ముఖ్యంగా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్, వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ వరుసగా విఫలమవుతున్నారు. ఈ ఇద్దరూ ఈ సిరీస్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా స్కోరు చేయలేదు. ఆసియాకప్‌ 2025లో సత్తాచాటిన తిలక్ వర్మ సైతం.. పెద్దగా రన్స్ చేయట్లేదు. దీంతో ఈ మ్యాచ్‌ ద్వారా వారు గాడిన పడాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టుతోనే టీమిండియా ఆడే అవకాశం ఉంది. జట్టులో మార్పులు చేయకపోవచ్చు.


ఇక ఆస్ట్రేలియాకు బ్యాటింగ్‌ పెద్ద సమస్యగా మారింది. యాషెస్‌ కోసం ట్రావిస్ హెడ్.. జట్టును వీడటం ఇబ్బంది కరంగా మారింది. మిచెల్‌ మార్ష్, స్టాయినిస్, టిమ్‌ డేవిడ్‌పైనే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. రీఎంట్రీ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆకట్టుకోలేదు. హేజిల్‌వుడ్ కూడా దూరం కావడం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది.


పిచ్ పరిస్థితి ఏంటి?


గబ్బా పిచ్‌ పేసర్లకు స్వర్గధామం లాంటిది. అయితే ఒక్కసారి బ్యాటర్లు కుదురుకుంటే రన్స్‌ కూడా ఈజీగానే వస్తాయి. ఇటీవల ఇక్కడ జరిగిన బిగ్‌బాష్‌ మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లోనూ సిక్స్‌లు, ఫోర్ల మోత మోగొచ్చు.


తుది జట్లు అంచనా..


భారత్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్, తిలక్‌ వర్మ, అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్, జితేశ్‌ శర్మ, శివమ్‌ దూబె, అర్ష్‌దీప్‌ సింగ్, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా


ఆస్ట్రేలియా: మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, ఇంగ్లిస్, టిమ్‌ డేవిడ్, మిచెల్‌ ఓవెన్‌, మార్కస్‌ స్టోయినిస్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, బార్ట్‌లెట్, డ్వార్షుయిస్, ఎలిస్, ఆడమ్‌ జంపా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa