ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే అత్యధిక వేగంతో దూసుకెళ్లే టాప్-10 రైళ్లు

international |  Suryaa Desk  | Published : Mon, Nov 10, 2025, 08:57 PM

ప్రపంచంలోని వేగవంతమైన రైళ్లు రవాణా రంగం రూపు రేఖలను మార్చేస్తున్నాయి. చైనా, జపాన్, యూరప్ దేశాలు మాగ్‌లెవ్, హై స్పీడ్ టెక్నాలజీతో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. కేవలం వేగం మాత్రమే కాకుండా.. పర్యావరణ అనుకూలమైన ప్రయాణ భవిష్యత్తును నిర్మిస్తున్నాయి. వేగవంతమైన రైళ్లు ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. చైనాలోని షాంఘై మాగ్‌లెవ్, జపాన్‌లోని ఎల్0 సిరీస్ మాగ్‌లెవ్ వరకు.. రకరకాల రైళ్లతో.. యూరప్‌, ఆసియా దేశాలు వేగం, భద్రత, పర్యావరణ అనుకూలతలో కీలక ముందగుడు వేస్తున్నాయి. షాంఘై మాగ్‌లెవ్ ప్రస్తుతం వాణిజ్య రైళ్లలో అత్యంత వేగంగా గంటకు 431 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తోంది. ఇక ఎల్0 సిరీస్ మాగ్‌లెవ్ ప్రయోగ దశలోనే గంటకు 602 కిలోమీటర్ల వేగం సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇక ఫ్రాన్స్‌‌కు చెందిన ఓ రైలు ట్రయల్స్‌లో గంటకు 574 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.


జపాన్ ఎల్0 సిరీస్ మాగ్‌లెవ్ (గంటకు 602 కిలోమీటర్లు)


జపాన్ తయారు చేసిన ఈ ఎల్0 సిరీస్ మాగ్‌లెవ్ రైలుకు 2015లో అక్కడి అధికారులు టెస్ట్ రన్‌ నిర్వహించారు. అందులో ఆ రైలు ప్రపంచ రికార్డును నెలకొల్పింది. గంటకు ఏకంగా 602 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది 2030 నాటికి ఈ జపాన్ ఎల్0 మాగ్‌లెవ్ రైలు.. వాణిజ్య సేవలకు అందుబాటులోకి రానుంది. ఇది సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్‌తో పరుగులు తీస్తుంది.


షాంఘై మాగ్‌లెవ్ (గంటకు 431 కిలోమీటర్లు)


చైనాకు చెందిన షాంఘై మాగ్‌లెవ్ రైలు గంటకు 431 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. ఇది ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇది మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్‌లెవ్) టెక్నాలజీని ఉపయోగిస్తుంది.


ఫ్రాన్స్ టీజీవీ పీఓఎస్ (గంటకు 574 కిలోమీటర్లు)


సాంప్రదాయ రైల్ టెక్నాలజీలో.. ఫ్రాన్స్‌కు చెందిన టీజీవీ పీఓఎస్ రైలు.. 2007లో గంటకు 574 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసి అప్పటి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇక ఈ ఫ్రాన్స్ టీజీవీ పీఓఎస్ రైలు.. ఆ తర్వాత పూర్తిగా అందుబాటులోకి వచ్చాక గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.


ఫుక్సింగ్ హావో సీఆర్400ఏఎఫ్ (చైనా) గంటకు 350 కిలోమీటర్లు


చైనాకు చెందిన మరో రైలు అత్యంత వేగవంతమైన రైళ్ల జాబితాలో నిలిచింది. ఫుక్సింగ్ హావో సీఆర్400ఏఎఫ్ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలు బీజింగ్-షాంఘై మధ్య ఉన్న 1,318 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 4.5 గంటల్లోనే పూర్తి చేస్తుంది.


షింకన్‌సెన్ ఈ5, హెచ్5 (జపాన్) (గంటకు 325 కిలోమీటర్లు)


జపాన్‌కు చెందిన బుల్లెట్ రైళ్లు అంటేనే సరైన సమయానికి గమ్యస్థానానికి చేరుకుంటాయని ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే. ఈ బుల్లెట్ రైళ్ల ఆలస్యం కేవలం సెకన్ల వ్యవధి మాత్రమే ఉంటుంది. మరోవైపు.. ఈ రైళ్లు ప్రయాణ భద్రతకు కూడా ప్రసిద్ధి చెందాయి. ఇక జపాన్ బుల్లెట్ రైళ్లను షింకన్‌సెన్ అని పిలుస్తూ ఉంటారు. జపాన్ షింకన్‌సెన్‌కు చెందిన ఈ5, హెచ్5 రైళ్లు గంటకు 325 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడతాయి.


యూరోస్టార్ ఈ320 (యూరప్) (గంటకు 320 కిలోమీటర్లు)


యూరప్‌కు చెందిన యూరోస్టార్ ఈ320 రైలు.. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ రైలు లండన్ నుంచి పారిస్, బ్రస్సెల్స్ వరకు ఛానల్ టన్నెల్ గుండా ప్రయాణం చేస్తుంది.


ఏవీఈ క్లాస్ 103 (స్పెయిన్)


స్పెయిన్ దేశానికి చెందిన ఏవీఈ క్లాస్ 103 రైలు.. గంటకు 310 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. మాడ్రిడ్-బార్సిలోనా వంటి మార్గాల్లో ఈ ఏవీఈ క్లాస్ 103 రైళ్లు పరుగులు తీస్తాయి.


కేటీఎక్స్-సాంచెయోన్ (దక్షిణ కొరియా)


ఈ హైస్పీడ్ రైళ్ల జాబితాలో దక్షిణ కొరియా కూడా నిలిచింది. దక్షిణ కొరియాకు చెందిన కేటీఎక్స్-సాంచెయోన్ రైలు.. గంటకు 305 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రాజధాని సియోల్ నుంచి బుసాన్ వంటి ప్రధాన నగరాలను కలుపుతూ ఈ కేటీఎక్స్-సాంచెయోన్ రైలు పరుగులు తీస్తుంది.


ఫ్రెకియారోస్సా 1000 (ఇటలీ)


ఇటలీకి చెందిన ఫ్రెకియారోస్సా 1000 రైలు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పట్టాలపై ప్రయాణిస్తుంది. మిలన్, రోమ్, నేపుల్స్ వంటి నగరాలకు ఈ ఫ్రెకియారోస్సా 1000 రైళ్లు ప్రయాణిస్తున్నాయి.


వేగవంతమైన రైళ్లు కలిగి ఉన్న దేశాల జాబితాలోకి చేరాలని భారత్ గత కొన్నేళ్ల నుంచి ఉవ్విళ్లూరుతోంది. ఇక దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధం అవుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు ఈ తొలి బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రైళ్లు టెక్నాలజీ తీరును చూస్తే భవిష్యత్తులో బుల్లెట్ రైళ్ల ద్వారా భారత్‌ కూడా అందులో పాలుపంచుకోనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa