కొద్ది రోజులుగా సహజీవనం చేస్తోన్న ఓ జంట.. తాళి బంధంతో శాశ్వతం చేసుకోవాలని భావించింది. కానీ, పెళ్లికి గంట ముందు ఇరువురి మధ్య జరిగిన గొడవతో చివరకు ఒకరి ప్రాణాలు తీసింది. చీర, డబ్బుల విషయంలో వాగ్వాదం చినికి చినికి గాలివానలా మారడంతో కాబోయే భార్యను వ్యక్తి ఐరన్ రాడ్డుతో తలపై కొట్టి, గోడకేసి గుద్దించి చంపిన ఘటన గుజరాత్లో భవ్నగర్లోని ప్రభుదాస్ లేక్లోని టెక్రీ చౌక వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు సాజన్ బరాయా, బాధితురాలు సోనీ హిమ్మత్ రాథోడ్లు గత ఏడాదిన్నరగా సహజీవనం చేస్తున్నారు. వారికి నిశ్చితార్థం సహా చాలా వరకు ఆచారాలు పూర్తయ్యాయి. దీంతో శనివారం రాత్రి వారు వివాహం చేసుకోవాల్సి ఉంది.
అయితే, పెళ్లికి గంట ముందు ఇరువురి మధ్య వధువు చీర, డబ్బుల గురించి గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో ఆవేశంతో ఇనుప రాడ్డు తీసుకొచ్చి సోనీనీ కొట్టిన నిందితుడు.. ఆ తర్వాత తలను గోడకేసి గుద్దించడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తర్వాత ఆ ఇంటిని ధ్వంసం చేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసుల బృందం అక్కడ చేరుకుంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు.
భవ్నగర్ డీఎస్పీ ఆర్ఆర్ సింఘాల్ మాట్లాడుతూ.. ‘ఇరు కుటుంబాలకు ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఇరువురూ ఏడాదిన్నర నుంచి సహజీవనంలో ఉన్నారు.. శనివారం రాత్రి వివాహం చేసుకోవాలని భావించారు.. పెళ్లికి గంట ముందు చీర, డబ్బుల గురించి వారి మధ్య గొడవ జరిగింది.. ఈ క్రమంలో ఆగ్రహంతో ఇనుప పైప్ను తీసుకుని సోనీపై దాడిచేశాడు.. అనంతరం ఆమె తనకు గోడకేసి గుద్దించి చంపేశాడు.. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించాం.. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది’ అని అన్నారు. అయితే, నిందితుడు సాజన్.. తమ పొరుగింటివారితోనూ గొడవపడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. యువతిని చంపినందుకు హత్య కేసు, పొరుగింటి వారితో గొడవపై మరో కేసు నమోదయ్యింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa