బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 89 సీట్లతో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 85 సీట్లు కైవసం చేసుకుంది. ఎల్జేపీ (రాం విలాస్) 19 సీట్లు దక్కుంచుకోగా.. ఇతరులు 9 సీట్లు గెలిచారు. దీంతో మొత్తంగా 202 సీట్లుతో సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్డీయే కూటమికి అవకాశం లభించింది. అయితే తదుపరి బిహార్ సీఎం ఎవరు అవుతారని సర్వత్రా చర్చ జరిగింది. నీతీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఉంటారని కొందరు అంటే.. మరికొందరు ఈ సారి మార్పులు ఉండచ్చేమో అని అభిప్రాయపడ్డారు. అయితే అందరి నిరీక్షణకు తెరదించుతూ బిహార్ సీఎం అభ్యర్థిని ఎన్డీఏ కూటమి ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. మళ్లీ నీతీశ్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రభుత్వంలో బీజేపీ కీలకంగా మారనుందని సమాచారం.
నీతీశ్ కుమార్ సీఎంగా పట్నా మైదానంలో నవంబర్ 19 లేదా 20 తేదీలలో కొత్త ప్రభుత్వం కొలువు తీరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం గాంధీ మైదానంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక ప్రధాని షెడ్యూల్ బట్టి తేదీని నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. సోమవారం (నవంబర్ 17) జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు ఆమోదం తెలిపి.. ఆ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత నీతీశ్ తన రాజీనామాను గవర్నర్కు సమర్పిస్తారు. తద్వారా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తారు.
బీజేపీకే సింహభాగం..
కాగా, ఈసారి మంత్రి పదవుల పంపకానికి కొత్త ఫార్ములా ఉపయోగిస్తున్నట్లు కూటమి వర్గాల సమాచారం. అందుకోసమే శనివారం కేంద్రమంత్రి అమిత్షాతో కూటమి నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పోస్టు లెక్కన పదవుల పంపకం జరగనుందని సమాచారం. అలా అయితే మంత్రివర్గంలో బీజేపీకే సింహభాగం వాటా దక్కే అవకాశం ఉంది. బీజేపీ నుంచి 15- 16, జేడీయూ నుంచి 14 మంది మంత్రులు ఉండనున్నారు. 19 సీట్లు గెలిచిన కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (రాం విలాస్) మూడు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇక ఐదు సీట్లు గెలిచిన హిందుస్తాన్ ఆవామీ మోర్చా, నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న రాష్ట్రీయ లోక్ మోర్చాలకు ఒక్కో మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa