భారతదేశంలో ఆదాయపు పన్ను వ్యవస్థ అమల్లో ఉంది. దీని కింద నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే.. అంతా పన్ను విధానాల్లోని టాక్స్ శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇందుకోసం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. కిందటి ఆర్థిక సంవత్సరం 2024-25 కు సంబంధించి.. ప్రస్తుత అసెస్మెంట్ ఇయర్లో (2025-26) ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఈ గడువు 2025, సెప్టెంబర్ 16తోనే ముగిసింది. ఇక వీటిని పరిశీలిస్తున్న ఐటీ శాఖ.. తప్పుడు మార్గాల్ని అనుసరించిన వారిని.. ఆదాయం సరిగా పేర్కొనని వారిని గుర్తించి వారికి నోటీసులు పంపే ప్రక్రియ ప్రారంభించింది.
ఐటీ రిటర్న్స్ కోసం ప్రతి ఒక్కరూ కచ్చితంగా తమ ఆదాయ వివరాల్ని పూర్తిగా వెల్లడించాలి. అద్దె ఆదాయం, ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం, విదేశీ ఆదాయం ఇలా అన్ని వివరాల్ని ఐటీఆర్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ పన్ను చెల్లించడం నుంచి తప్పించుకునేందుకు కొందరు అన్ని ఆదాయాల్ని పేర్కొనరు. ఈ క్రమంలోనే ఐటీ శాఖ అప్రమత్తం అవుతోంది. ఇటీవల అనుసరిస్తున్న అత్యాధునిక టెక్నాలజీతో.. ఇలాంటి వారిని ముందుగానే గుర్తిస్తోంది.
అయినప్పటికీ స్వచ్చంధంగా వారే ముందుకు వచ్చేలా ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ NUDGE (నాన్- ఇంట్రుసివ్ యూసేజ్ ఆఫ్ డేటా టు గైడ్ అండ్ ఎనేబుల్) పేరిట స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ప్రధానంగా దీని కింద విదేశీ ఆస్తులు, ఆదాయానికి సంబంధించి సమాచారాన్ని సరిగ్గా వెల్లడించేలా ప్రోత్సహించేందుకు దీనిని తీసుకొచ్చింది. టాక్స్ పేయర్ల డేటాను విశ్లేషించడం ద్వారా.. తాము గుర్తించిన వ్యత్యాసాల్ని తెలియజేసి.. జరిమానా, ఇతర శిక్షల నుంచి తప్పించుకునేందుకు రిటర్న్స్ సరిదిద్దుకునేలా ప్రోత్సహిస్తోంది.
ఇక్కడ విదేశీ అధికార పరిధి నుంచి అందుకున్న సమాచారం ఆధారంగా.. హై రిస్క్ కేసుల్ని గుర్తించి వారికి నోటీసుల్ని.. ఎస్ఎంఎస్/మెయిల్స్ రూపంలో పంపిస్తోంది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT). వీరు శిక్ష నుంచి తప్పించుకోవాలంటే.. అన్ని ఆదాయాల్ని రివైజ్డ్ రిటర్న్స్లో (సవరించిన రిటర్న్స్) పేర్కొని.. డిసెంబర్ 31లోపు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రెండో దశ ప్రచారం కింద నోటీసులు నవంబర్ 28 నుంచి అందుకోనున్నారు. అంతకుముందు తొలి దశ క్యాంపెయిన్ కింద అసెస్మెంట్ ఇయర్కు 2024-25 ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారిలో.. సుమారు 25 వేల మంది వరకు నోటీసులు అందుకున్నారు. వీరు తర్వాత తమ తప్పుల్ని సరిదిద్దుకొని.. రూ. 29,208 కోట్ల విదేశీ ఆస్తుల్ని, ఇంకా రూ. 1089.88 కోట్ల విదేశీ వనరుల ఆదాయాన్ని రిటర్న్స్లో నివేదించారు. లేని పక్షంలో.. వారికి భారీ జరిమానా ఇంకా జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa