దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్.. ఇటీవల పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు దేశీయ స్టాక్ మార్కెట్లలో సానుకూల సంకేతాలు.. మరోవైపు బలమైన త్రైమాసిక ఫలితాలు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లవైపు ఇన్వెస్టర్లను ఆకర్షించేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వరుస సెషన్లలో రాణిస్తూ వెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు.. రోజురోజుకూ కొత్త గరిష్టాల్ని తాకుతూనే ఉంది. శుక్రవారం సెషన్లో ఇంట్రాడేలో రూ. 1581.30 వద్ద NSE లో 52 వారాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. అంటే ఏడాది వ్యవధిలో ఈ స్టాక్ హైయెస్ట్ ధర ఇదేనన్నమాట. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు వస్తున్నాయని చెప్పొచ్చు.
కిందటి సెషన్లో రూ. 1563.40 వద్ద ముగిసిన రిలయన్స్ స్టాక్.. ఇవాళ స్వల్ప లాభంతో రూ. 1568 వద్ద ఓపెన్ అయింది. తర్వాత మళ్లీ స్వల్పంగా తగ్గి రూ. 1563 వద్దకు చేరింది. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ మళ్లీ పుంజుకోవడంతో రూ. 1581.30 గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో (శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు) ఈ స్టాక్ ధర దాదాపు 0.70 శాతం లాభంతో రూ. 1574 స్థాయిలో ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 21.26 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ విలువ పరంగా దేశంలో ఇదే అతిపెద్ద కంపెనీ కావడం విశేషం. గత 5 రోజుల్లో 2 శాతం పెరిగిన రిలయన్స్ షేరు.. నెలలో 6 శాతం, 6 నెలల్లో 12 శాతం పుంజుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు 29 శాతం పెరిగింది. ఇలా స్థిరంగా ఇన్వెస్టర్లకు రిటర్న్స్ ఇస్తూ వెళ్తోంది.
సాధారణంగా ఏదైనా ప్రతికూల ప్రకటన వచ్చినప్పుడు స్టాక్స్ పతనం అవుతుంటాయి. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇందుకు భిన్నంగా ఉంది. అహ్మదాబాద్ CGST జాయింట్ కమిషనర్ నుంచి.. రిలయన్స్ ఇండస్ట్రీస్కు రూ. 56.44 కోట్లు చెల్లించాలని పన్ను నోటీసులు అందాయి. ఈ మేరకు కంపెనీ స్వయంగా రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. అయితే దీనిపై అప్పీల్ చేసేందుకు చూస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది.
ఈ ఆర్డర్ కారణంగా.. కంపెనీ కార్యకలాపాలపై, ఇతర యాక్టివిటీస్పై ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు కంపెనీపై విశ్వాసం ఉంచినట్లు తెలుస్తోంది. అందుకే స్టాక్ పడిపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిలయన్స్ బలమైన ఫలితాల నేపథ్యంలో.. పలు బ్రోకరేజీలు ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్ పెంచుతూ.. రేటింగ్ను పెంచుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ స్టాక్పై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa