చిరుతపులిని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఓ వ్యక్తి చిక్కుకుపోయిన వింత సంఘటన ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో జరిగింది. ఎరగా కట్టిన మేకను దొంగిలించే ప్రయత్నంలో మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి దాదాపు రెండు గంటల పాటు బోనులోనే బందీగా ఉన్నాడు.వివరాల్లోకి వెళ్ళితే.... ఫఖర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రి దెహలో గ్రామంలో రెండు రోజుల క్రితం చిరుత దాడిలో శాంతి దేవి (55) అనే వృద్ధురాలు మరణించింది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, ఆ చిరుతను పట్టుకోవడానికి గ్రామానికి సమీపంలో ఒక బోనును ఏర్పాటు చేసి, అందులో మేకను ఎరగా కట్టారు.గురువారం రాత్రి ప్రదీప్ (45) అనే స్థానిక వ్యక్తి మద్యం మత్తులో ఆ బోను వద్దకు వచ్చాడు. మేకను దొంగిలించే ఉద్దేశంతో లోపలికి వెళ్లగా ఆటోమేటిక్ డోర్ ఒక్కసారిగా మూసుకుపోయింది. దీంతో అతను మేకతో పాటు లోపలే చిక్కుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక, తన మొబైల్ ఫోన్ ద్వారా గ్రామస్థులకు ఫోన్ చేసి సహాయం కోరాడు.సమాచారం అందుకున్న గ్రామస్థులు, అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని సురక్షితంగా బయటకు తీశారు. విచారణలో "బోను సరిగ్గా పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి వెళ్లాను" అని ప్రదీప్ చెప్పగా, మేకను దొంగిలించడానికే వెళ్లాడని గ్రామస్థులు ఆరోపించారు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ, ప్రదీప్పై ఎలాంటి కేసు నమోదు చేయలేదని, కానీ భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం చేయవద్దని గట్టిగా హెచ్చరించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa