రాజస్థాన్ హైకోర్టు సహజీవనం చేసే జంటల వయసుల విషయంలో సంచలన తీర్పు వెలువరించింది. యుక్త వయస్సు వచ్చిన ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేయడంలో తప్పు లేదని చెప్పిన న్యాయస్థానం.. వివాహ వయస్సు రాకపోయినా కలిసి జీవించవచ్చని స్పష్టం చేసింది. వివాహ వయస్సు నెపంతో.. రాజ్యాంగం కల్పించిన హక్కులను కొట్టిపారేయలేమని కోర్టు పేర్కొంది.
అసలు ఏ కేసులో న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది?
18 ఏళ్ల మహిళ, 19 ఏళ్ల అబ్బాయి రక్షణ కోరుతూ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేస్తున్నామని.. ముఖ్యంగా 2025 అక్టోబర్ 27వ తేదీ నుంచి తాము కలిసి ఉండడానికి ఒప్పందం కూడా చేసుకున్నామని ఆ జంట కోర్టుకు తెలిపింది. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు తమ సహజీవనాన్ని వ్యతిరేకిస్తున్నారని.. తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ జంట ఆరోపించింది.
అయితే ఈ పిటిషన్ను వ్యతిరేకిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేక్ చౌదరీ వాదించారు. ఆ యువకుడికి ఇంకా 21 ఏళ్లు నిండలేదని, వివాహ వయస్సు కూడా రాలేదని చెప్పారు. కాబట్టి సహజీవనం కొనసాగించేందుకు అనుమతి ఇవ్వకూడదని కోర్టుకు విన్నవించారు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు కొట్టివేసింది. పెళ్లి వయస్సు రాలేదనే కారణంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన స్వేచ్ఛా హక్కును హరించలేమని పేర్కొంది. భారతీయ చట్టాల ప్రకారం సహజీవనాన్ని నిషేధించలేమని.. దీనిని నేరంగా కూడా చూడలేమని జస్టిస్ అనూప్ ధండ్ స్పష్టం చేశారు.
అలాగే పిటిషన్లో ఉన్న అంశాలను పూర్తిగా పరిశీలించి.. యువ జంటకు రక్షణ కల్పించవలసిందిగా భిల్వారా, జోధ్పూర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివాహ వయసు రాకపోయినా.. ఇకపై సహజీవనం చేయొచ్చు అంటూ అనేక మంది పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఇది సరైన నిర్ణయంగా అనిపించడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి రాజస్థాన్ హైకోర్టు చెప్పిన ఈ తీర్పు మీకెలా అనిపిస్తుందో కామెంట్ల రూపంలో వెల్లడించేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa