ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్‌కతాలో ల్యాండ్ అయిన మెస్సి.. ఫ్యాన్స్‌తో నిండిపోయిన ఎయిర్‌పోర్ట్‌

sports |  Suryaa Desk  | Published : Sat, Dec 13, 2025, 10:45 PM

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ది గోట్ టూర్‌లో భాగంగా భారత్‌కు చేరుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 2.26 గంటలకు మెస్సి, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌క‌తా విమానాశ్ర‌యంలో దిగాడు. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు వేలాది సంఖ్యలో ఫ్యాన్స్.. ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు. ముఖ్యంగా ఇంట‌ర్నేష‌న‌ల్ అరైవ‌ల్స్‌కు చెందిన గేట్ 4 వ‌ద్ద వేల సంఖ్య‌లో జ‌నం గుమ్మిగూడారు. మెస్సి.. మెస్సి అంటూ నినాదాలు చేశారు.


భారీ భ‌ద్ర‌త మ‌ధ్య కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లోని వీఐపీ గేట్ ద్వారా మెస్సి బ‌య‌ట‌కు వెళ్లాడు. ఉరుగ్వేకు చెందిన లూయిస్‌ సువారెజ్‌, అర్జెంటీనా ప్లేయర్ రోడ్రిగో డి పాల్‌ కూడా మెస్సితో పాటు వచ్చారు. వీరంతా నేరుగా తాము బస చేసే హోటల్‌కు వెళ్లిపోయారు. మెస్సి మూడు రోజుల పాటు భారత్‌లోనే పర్యటించనున్నాడు. కోల్‌క‌తాతో పాటు హైద‌రాబాద్‌, ముంబై, ఢిల్లీల్లోనూ మెస్సి టూర్ చేయ‌నున్నాడు.


మెస్సిని చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే భద్రతా పరమైన కారణాలతో అతడిని ఉద‌యం 3.30 నిమిషాల‌కు బ్యాక్ గేటు ద్వారా హోట‌ల్‌కు తీసుకెళ్లారు. దీంతో ఫ్యాన్స్ తమ అభిమాని ఆటగాడిని ఎయిర్‌పోర్ట్‌లో చూడలేకపోయారు. అనంతరం హ‌య్య‌త్ రీజెన్సీ హోట‌ల్‌లోని రూమ్ నెంబ‌ర్ 730 లోకి మెస్సి చెకిన్ అయ్యాడు. అత‌డు ఉంటున్న ఏడో ఫ్లోర్‌లోని సూట్‌ను పూర్తిగా సీల్ చేశారు.


ఇక కోల్‌కతాలో పలు కార్యక్రమాల్లో మెస్సి పాల్గొంటాడు. ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడతాడు. అంతేకాకుండా బెంగాల్ సీఎం మ‌మతా బెన‌ర్జీతో పాటు బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొంటాడు. లేక్ టౌన్‌లో ఉన్న 70 అడుగుల ఎత్తైన విగ్ర‌హాన్ని వ‌ర్చువ‌ల్‌గా మెస్సి ప్రారంభిస్తారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు హైద‌రాబాద్‌కు స్టార్ట్ అవుతాడు. రాత్రి 7 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఆడతాడు. ఈ మ్యాచ్‌కు రాహుల్ గాంధీతో పాటుగా ఆయన మేనల్లుడు, తెలంగాణకు చెందిన మంత్రులు, ప్రముఖులు హాజరవుతారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa