ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రహదారుల కనెక్టివిటీపై నితిన్ గడ్కరీతో సమావేశమైన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 20, 2025, 02:34 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అత్యుత్తమ రహదారి కనెక్టివిటీని కల్పించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాజధాని నగరాన్ని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించే కీలకమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ ను బలోపేతం చేయడంలో గడ్కరీ చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు.ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధికి అత్యంత కీలకమైన రెండు ప్రధాన ప్రాజెక్టులను చంద్రబాబు ప్రస్తావించారు. కృష్ణా నదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు లేన్ల ఐకానిక్ కేబుల్ స్టెడ్ వంతెన నిర్మాణ బాధ్యతను జాతీయ రహదారుల సంస్థ (NHAI) చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూలపాడు వద్ద నిర్మించ తలపెట్టిన ఈ వంతెన, అమరావతిని మూడు కీలక జాతీయ రహదారులతో అనుసంధానిస్తుందని వివరించారు. విజయవాడ-హైదరాబాద్, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారులతో పాటు తీరప్రాంత రోడ్ కారిడార్‌తో ఈ వంతెన రాజధానికి వారధిగా నిలుస్తుందని తెలిపారు. ఒక ప్రధాన నదిపై నిర్మించే ఈ ఐకానిక్ వంతెన రాష్ట్ర రాజధానికి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని, దీని నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని కోరారు.అలాగే, హైదరాబాద్ నుంచి అమరావతి వరకు ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి కూడా చంద్రబాబు చర్చించారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే రెండు నగరాల మధ్య హై-స్పీడ్ యాక్సెస్ ఏర్పడుతుందని, తద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు కేవలం కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా, అమరావతిని జాతీయ రహదారి గ్రిడ్‌లో ఒక ప్రధాన మొబిలిటీ కేంద్రంగా, లాజిస్టిక్స్ నోడ్‌గా మారుస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa