గుడ్ల వినియోగం క్యాన్సర్కు దారితీస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. దీనిపై శనివారం స్పందించిన కేంద్ర సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎఫ్ఎస్ఎస్ఏఐ ).. ఈ ప్రచారాన్ని ఖండించింది. దీనికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లేవని.. తప్పుదోవ పట్టించేవి అని కొట్టిపారేసింది. కోడి గుడ్లలో నైట్రోఫ్యూరాన్ మెటబాలైట్స్ వంటి హానికారక పదార్థాలు ఉన్నాయనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. నిబంధనల ప్రకారం వీటి వాడకం భారత్లో పూర్తిగా నిషేధమని తేల్చి చెప్పింది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం.. పౌల్ట్రీ పరిశ్రమలో ఏ దశలోనూ నైట్రోఫ్యూరాన్ల వంటి యాంటీబయాటిక్స్ను వాడటం నేరం. ఆహార భద్రత, ప్రమాణాల (కలుషితాలు, విషపదార్థాలు, అవశేషాలు) నిబంధనలు 2011 కింద ఈ నైట్రోఫ్యూరాన్లను పూర్తిగా నిషేధించారు. నియంత్రణ కోసం కేవలం 1.0 µg/kg పరిమితిని నిర్ణయించారు. దీని అర్థం ఏంటంటే.. అంతకంటే తక్కువ స్థాయిలో ఏవైనా అవశేషాలు ఉన్నా.. అది ఆహార భద్రతా ఉల్లంఘన కిందకు రాదు. పైగా మనుషుల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించదు.
స్వల్ప స్థాయిలో నైట్రోఫ్యూరాన్ అవశేషాలు ఉన్నప్పటికీ.. వాటి కారణంగా క్యాన్సర్ వస్తుంది అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. భారతీయ ఆహార భద్రతా ప్రమాణాలు యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. ఏదైనా ఒక బ్రాండ్లో లోపాలు కనిపిస్తే.. అది కేవలం ఒక బ్యాచ్కు సంబంధించిన పొరపాటు మాత్రమే తప్ప.. దేశంలోని మొత్తం కోడి గుడ్ల సరఫరా వ్యవస్థకు వర్తించదని వెల్లడించింది.
కేవలం సోషల్ మీడియా పోస్టులను చూసి భయపడకుండా.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రజలకు సూచించింది. కోడి గుడ్లు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు అందించే అత్యుత్తమ పోషకాహారమని.. సమతుల్య ఆహారంలో గుడ్డు ఒక ముఖ్యమైన భాగమని స్పష్టం చేసింది. అందుకే ఎలాంటి భయాలు పెట్టుకోకుండా గుడ్లను ఆహారంగా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు భరోసా ఇస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa