ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిరిండియా బిజినెస్ క్లాస్‌లో.. నాసిరకం భోజనం, సీటుపై ఈగలు, వీడియో వైరల్

national |  Suryaa Desk  | Published : Sat, Dec 20, 2025, 08:34 PM

ప్రముఖ ఫుడ్ వ్లాగర్ పవిత్రా కౌర్ .. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ఎయిరిండియా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించగా.. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన పరిస్థితులను గుర్తు చేసుకుని.. తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. రూ. 4 లక్షలు పెట్టి.. టికెట్ కొనుగోలు చేసినప్పటికీ.. ఎయిరిండియా విమానంలో సరైన సౌకర్యాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విమానం పరిశుభ్రంగా లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా తన సీటుపై చనిపోయిన ఈగలు ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు ప్రయాణికులకు పెట్టిన ఆహారం కూడా నాసిరకంగా ఉందని ఆమె మండిపడ్డారు. తన ప్రయాణ అనుభవానికి 10కి కేవలం 6 రేటింగ్ మాత్రమే ఇస్తానని తెలిపారు. ఎయిరిండియా వంటి ప్రీమియం ఎయిర్‌లైన్స్ సర్వీసుల్లో కనీస ప్రమాణాలు లేకపోవడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు.


అంతర్జాతీయ ప్రయాణాల్లో బిజినెస్ క్లాస్ అంటే చాలా విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని ఎవరైనా ఊహిస్తారు. కానీ పవిత్రా కౌర్‌కు మొదటి సీటు వద్దే సమస్య ఎదురైంది. గేట్ సమస్య కారణంగా ఆమెను తన సీటు నుంచి వేరే సీటుకు మార్చారు. అయినా అక్కడ కూడా అదే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి సౌకర్యాల కోసమేనా తాను రూ. 4 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసి.. టికెట్ కొని ప్రయాణం చేస్తున్నది అని ఆమె తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


విమానంలో శుభ్రత విషయంలో ఎదురైన అనుభవం తనను తీవ్రంగా కలిచివేసినట్లు పవిత్రా కౌర్ తెలిపారు. విమాన క్యాబిన్‌లో కనీస పరిశుభ్రత పాటించడం లేదని ఆరోపించారు. తన సీటుపై రెండు చచ్చిన ఈగలను చూశానని పేర్కొన్నారు. ఇలా ఎందుకు అంటూ ఎయిరిండియా యాజమాన్యాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా నిలదీశారు.


ఇక పవిత్రా కౌర్ స్వయంగా ఒక ఫుడ్ వ్లాగర్ కావడంతో.. సాధారణంగానే ఆమె దృష్టి ప్రధానంగా ఆ విమానంలో వడ్డించే ఆహారంపై పడింది. మెయిన్ కోర్స్ ఆహారం పరవాలేదనిపించినా.. అపెటైజర్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా డెజర్ట్స్ విషయంలో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చాక్లెట్ మూసే చాలా దారుణంగా ఉందని.. పండ్లు కూడా పూర్తిగా ఎండిపోయి ఉన్నాయని పేర్కొన్నారు. తన జీవితంలో విమానంలో ఆహారం తినకుండా వదిలేయడం ఇదే మొదటిసారి అని ఆమె వాపోయారంటే.. పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే షాంపైన్, డ్రింక్స్ మాత్రం బాగున్నాయని పవిత్రా కౌర్ చెప్పారు.


ఇన్ని ఫిర్యాదులు ఉన్నప్పటికీ.. సీట్లు సౌకర్యవంతంగా ఉండటం వల్ల సుదీర్ఘ ప్రయాణంలో తాను బాగా నిద్రపోయినట్లు పవిత్రా కౌర్ కాస్త ఊరట చెందారు. దటీజ్ ఎయిరిండియా అంటూనే.. తనకు వేరే మార్గం లేక ఈ విమాన టికెట్ బుక్ చేసుకున్నానని తెలిపారు. ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ.. తాను ఊహించిన దాని కంటే ఈ ప్రయాణం కొంత మెరుగ్గానే ఉందని ఆమె తన వీడియోను ముగించడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో.. మరోసారి విమాన ప్రయాణాలు, ఎయిర్‌లైన్స్ అందించే సర్వీసులు, ప్రయాణికుల పట్ల విమానయాన సంస్థల తీరుపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa