కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్బీ జేపీ, ఆరెస్సెస్ లపై చేసిన ప్రశంసలు రాజకీయ దుమారం రేపాయి. దీంతో ఆయన వెంటనే యూ-టర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను కేవలం వారి సంస్థాగత బలాన్ని మాత్రమే మెచ్చుకున్నానని వివరణ ఇచ్చారు.అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీతో కలిసి ఉన్న 1996 నాటి ఫొటోను దిగ్విజయ్ సింగ్ ‘ఎక్స్’లో పంచుకున్నారు. ఆరెస్సెస్ స్వయంసేవకులు, జనసంఘ్ కార్యకర్తలు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయికి ఎదగడం వారి సంస్థాగత శక్తికి నిదర్శనం అద్వానీ కాళ్ల వద్ద కూర్చున్న నేత ఇవాళ ప్రధానిగా ఉన్నారు అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తలను అగ్ర నాయకత్వ స్థానాలకు ప్రోత్సహించడాన్ని ఆయన పరోక్షంగా ప్రశంసించారు.అయితే, ఈ పోస్టుపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన మీడియా ముందు స్పందించారు.నేను సంస్థాగత నిర్మాణాన్ని సమర్థిస్తాను. కానీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీలకు వ్యతిరేకిని. నేను వారి సంస్థాగత బలాన్ని మాత్రమే పొగిడాను. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలను ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నాను అని స్పష్టం చేశారు.ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే దిగ్విజయ్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. తన పోస్టుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను ట్యాగ్ చేయడంతో ఇది పార్టీ నాయకత్వానికి పంపిన అంతర్గత సందేశమా అనే ఊహాగానాలకు తెరలేపింది.ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా స్పందిస్తూ ఎవరూ ఎవరినీ పొగడలేదని, తప్పుడు ప్రచారం చేయవద్దని అన్నారు. మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఈ అంశంపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్లో నియంతృత్వ పోకడలు ఉన్నాయంటూ దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ధైర్యంగా స్పందిస్తారా అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa