ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ విజయవాడ , గ్రేటర్ తిరుపతి ఏర్పాటుపై వెనక్కి తగ్గింది. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాటు చేస్తారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్ అవసరాల దృష్ట్యా.. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతికి అధికారులు ప్రతిపాదనలు కూడా చేశారు. అయితే ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం పక్కనబెట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం వెల్లడించారు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాటుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ జనగణన పూర్తి అయ్యే వరకూ డీలిమిటేషన్ చేయకూడదంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ నేపథ్యంలో విజయవాడ, తిరుపతికి గ్రేటర్ హోదా కల్పించే ప్రక్రియను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. జనగణన ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే విజయవాడ. తిరుపతికి గ్రేటర్ హోదా ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని.. సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారని మంత్రి నారాయణ వెల్లడించారు.
మరోవైపు విజయవాడకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీను విలీనం చేసి గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. గ్రేటర్ విజయవాడ ఏర్పాటుతో విస్తీర్ణం పెరుగుతుందని.. జనాభా 20 లక్షలు దాటుతుందని అంచనా వేశారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుంచి భారీగా నిధులు వస్తాయని.. వేగంగా అభివృద్ధి జరగడానికి వీలు ఉంటుందని భావించారు. ఈ క్రమంలోనే విజయవాడలోకి చుట్టుపక్కల ఉన్న 74 గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించారు. అయితే ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై తాజాగా వెనక్కి తగ్గింది.
మరోవైపు అటు తిరుపతి కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. పర్యాటకం, ఆధ్మాత్మికంతో పాటుగా విద్య, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు తిరుపతి కేంద్రంగా మారుతోంది. దీంతో ఇళ్లు దొరకడం కష్టంగా మారి సుమారు 30 శాతం మంది శివారు ప్రాంతాలకు వెళ్తున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ తిరుపతి ఏర్పాటు చేయాలని.. తిరుపతి గ్రామీణం, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు, రామచంద్రాపురం మండలాలలో ఉన్న 63 గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని భావించారు. అయితే ఈ ప్రతిపాదన నుంచి కూడా ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
గ్రేటర్ హోదాకు.. జనగణనకు లింకేంటి?
విజయవాడ, తిరుపతికి గ్రేటర్ హోదా కల్పించాలంటే డిసెంబర్ 31లోపు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే జనవరి నుంచి ఏపీలో జనగణన ప్రారంభం కానుంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం.. ఆ పనుల్లో ఉంటుంది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జనగణన పూర్తయ్యే వరకూ ఈ ప్రతిపాదనలు పక్కన పెట్టింది ఏపీ ప్రభుత్వం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa