రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు వైయస్ఆర్సీపీ పంచాయత్ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రా రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బెలుం గుహలను సందర్శించడానికి వచ్చిన పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అల్ ఇండియా ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్కు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వెన్నపూస రవీంద్రా రెడ్డి మాట్లాడుతూ… రాజ్యాంగ పరంగా పంచాయతీ రాజ్ సంస్థలకు కేటాయించిన 15వ ఫైనాన్స్ నిధులపై కూటమి ప్రభుత్వం అక్రమంగా పెత్తనం చెలాయిస్తూ దొంగ సర్క్యూలర్లు జారీ చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా మెమో నంబర్ 3082065 (తేది: 24-12-2025) ద్వారా నిధులను వినియోగించకుండా అడ్డుకోవడం పూర్తిగా అన్యాయమన్నారు. ఈ మెమోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.పంచాయతీ స్థాయి ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పొందవలసిన గౌరవ వేతనాలను కూడా ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వ ప్రోటోకాల్ను పాటించకుండా స్థానిక ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని, ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ అన్ని చర్యలకు కారణం ఒక్కటే… స్థానిక ప్రజాప్రతినిధులు వైయస్ఆర్సీపీకి చెందిన వారే కావడమని వెన్నపూస రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.ఇలాంటి దొంగ సర్క్యూలర్లే కూటమి ప్రభుత్వ పతనానికి నాంది అవుతాయని హెచ్చరిస్తూ, ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa