ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టాలు తప్పి పక్కకు పడిపోయిన ప్యాసింజర్ రైలు.. 13 మంది మృతి

Crime |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 09:13 PM

మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకా ఆదివారం రోజు జరిగిన భారీ రైలు ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దేశ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇంటర్‌ఓషియానిక్ కారిడార్'లో భాగంగా నడుస్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో.. 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వంద మంది వరకు ప్రయాణికులు గాయపడటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


మెక్సికన్ నావీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజాండా పట్టణం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో రైలులో 9 మంది సిబ్బంది సహా మొత్తం 250 మంది ప్రయాణిస్తున్నారు. రైలు వేగంగా వెళ్తున్న క్రమంలో అదుపు పట్టాలు తప్పాయి. ఫలితంగా పక్కకు పడిపోయింది. ఈక్రమంలోనే రైల్లో ఉన్న ప్రయాణికులంతా హాహాకారాలు చేశారు. ఈ దారుణ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 98 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 36 మందిని ఆసుపత్రికి తరలించగా.. ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ స్వయంగా వెల్లడించారు.


ఈ దుర్ఘటనపై అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సీనియర్ అధికారులను ఘటనా స్థలానికి పంపినట్లు ఆమె తెలిపారు. మెక్సికో అటార్నీ జనరల్ ఎర్నెస్టినా గోడాయ్ రామోస్ ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక మానవ తప్పిదం వల్ల జరిగిందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. మెక్సికన్ నావీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.


ఈ ప్రమాదం జరిగిన రైలు మార్గం మెక్సికోకు అత్యంత కీలకమైనది. 2023లో అప్పటి అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ హయాంలో ప్రారంభమైన ఈ 'ఇంటర్‌ఓషియానిక్ రైలు'.. పసిఫిక్ మహాసముద్రంలోని సెలినా క్రజ్ రేవును, అట్లాంటిక్ తీరంలోని కోట్జాకోయల్కోస్‌తో కలుపుతుంది. సుమారు 180 మైళ్ల (290 కి.మీ) పొడవున్న ఈ మార్గం ప్రపంచ ప్రసిద్ధ పనామా కాలువకు ప్రత్యామ్నాయంగా, అంతర్జాతీయ వాణిజ్యానికి వ్యూహాత్మక మార్గంగా మెక్సికో ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ రైలు మార్గంలో ఇలాంటి పెద్ద ప్రమాదం జరగడం ఆ దేశ మౌలిక సదుపాయాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు సైన్యం, సివిల్ ప్రొటెక్షన్ బృందాలు రంగంలోకి దిగాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa