ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ బ్యాంకులో అప్పు తీసుకున్నవారికి షాక్.... రంగంలోకి ప్రైవేట్ కంపెనీ

business |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 11:47 PM

తమ వద్ద అప్పు తీసుకుని ఎగవేస్తున్న వారిపై బంధన్ బ్యాంక్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మొండి బకాయిలను వసూలు చేసే బాధ్యతను ఒక ప్రైవేట్ రికవరీ సంస్థకు అప్పగించింది. మైక్రోఫైనాన్స్ విభాగంలో పేరుకుపోయిన రూ. 3,212 కోట్ల భారీ రుణాలను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్ కు విక్రయిస్తూ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ అప్పులను ఏఆర్‌సీఐఎల్ వసూలు చేయనుంది. ఈ మేరకు బ్యాంకు కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.


ఈ ఒప్పందం కారణంగా ఇకపై ఈ అప్పుల వసూలు వ్యవహారంతో బ్యాంకుకు సంబంధం ఉండదు. ఆ ప్రైవేట్ కంపెనీయే రంగంలోకి దిగి బకాయిలను రాబట్టుకుంటుంది. సాధారణంగా బ్యాంకులు తమ అప్పులు వసూలు కానప్పుడు ఆ భారాన్ని తగ్గించుకోవడానికి బ్యాడ్ బ్యాంక్ లేదా అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలకు ఆ రుణాలను విక్రయిస్తాయి. ఇప్పుడు బంధన్ బ్యాంక్ సైతం అదే పని చేసింది. తమ బ్యాంకులో పేరుకుపోయిన రూ.3,212 కోట్ల మొండి బాకీలను ఏఆర్‌సీఐఎల్‌కి విక్రయించింది.


మొదటి విడతలో భాగంగా రూ. 3,212 కోట్ల మైక్రోఫైనాన్స్ రుణాలను ఆర్సిల్ కంపెనీ రూ. 578 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే అసలు మొత్తంలో కేవలం 18 శాతం చెల్లించి ఆ రుణాల వసూలు హక్కులను ఆ ప్రైవేట్ సంస్థ దక్కించుకుంది. రెండవ విడతలో కేవలం మైక్రోఫైనాన్స్ మాత్రమే కాకుండా మరో రూ. 3,720 కోట్ల విలువైన ఇతర రుణాలను (గ్రూప్ లోన్స్, అగ్రి, చిన్న వ్యాపార రుణాలు) కూడా సుమారు రూ. 333 కోట్లకు విక్రయించడానికి బ్యాంక్ సిద్ధమైంది. మొత్తంగా చూస్తే సుమారు రూ. 7,000 కోట్ల మేర మొండి బకాయిల వసూలు బాధ్యత ఇప్పుడు ప్రైవేట్ సంస్థల చేతికి వెళ్తోంది.


ఎందుకు ఈ నిర్ణయం?


బంధన్ బ్యాంక్ తన ఆస్తుల నాణ్యతను మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఈ అడుగు వేసింది. వసూలు కాని రుణాల కోసం బ్యాంక్ సిబ్బంది సమయం వృథా చేయకుండా, ఆ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడం వల్ల బ్యాంక్ తన ఇతర సేవలపై దృష్టి పెట్టవచ్చు. సెప్టెంబర్ 2025 నాటికి బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 5 శాతానికి చేరాయి. వీటిని బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగించడం ద్వారా బ్యాంక్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా కనిపిస్తుంది. ఈ రుణాల విక్రయం పారదర్శకంగా జరిగిందని, అత్యధిక బిడ్ దాఖలు చేసిన ఆర్సిల్‌కే ఈ బాధ్యత అప్పగించామని బ్యాంక్ తెలిపింది.


రుణాలు వసూలు చేసే ప్రైవేట్ కంపెనీలు సాధారణంగా కఠినమైన వసూలు పద్ధతులను అనుసరిస్తాయి. బ్యాంకులతో పోలిస్తే, ఈ కంపెనీలకు మొండి బకాయిలను రాబట్టడంలో ప్రత్యేక నైపుణ్యం, చట్టపరమైన అధికారాలు ఉంటాయి. అప్పు తీసుకున్న వారు ఇకపై నేరుగా ఆర్సిల్ కంపెనీతోనే వ్యవహరించాల్సి ఉంటుంది. రుణాలు కట్టని వారి ఆస్తుల వేలం లేదా ఇతర రికవరీ చర్యలను ఈ ప్రైవేట్ సంస్థలు వేగవంతం చేస్తాయి. బంధన్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా తమ బ్యాలెన్స్ షీట్‌ను ప్రక్షాళన చేయడమే కాకుండా, ఎగవేతదారులకు ఒక గట్టి హెచ్చరిక పంపింది. అప్పులు వసూలు చేసే బాధ్యత ప్రైవేట్ సంస్థల చేతికి వెళ్లడం వల్ల రికవరీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa