తిరుమల శ్రీవారిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు.. ఈ సమయంలో స్వామివారికి కానుకలు, విరాళాలు అందజేస్తుంటారు. కొంతమంది భక్తులు డబ్బులు, బంగారం, విలువైన వస్తువుల్ని నేరుగా ఆలయంలో హుండీలో వేస్తారు. కొందరు భక్తులు మాత్రం తిరుమల శ్రీవారి పేరుతో టీటీడీ నిర్వహించే ట్రస్టులకు విరాళాలు అందిస్తారు. మరికొందరు టీటీడీకి అవసరమైన వస్తువులు, మెషిన్లు, వాహనాలు.. ఇలా అవసరమైన వాటిని కానుకలుగా ఇస్తారు. టీటీడీ నిర్వహించే ట్రస్టుల ద్వారా భక్తులు, ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు.
గుంటూరు విజ్ఞాన్స్ విద్యాసంస్థల అధినేత, నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి లావు రత్తయ్య టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్కు రూ.1 కోటి విరాళం అందజేశారు. తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడుని కలిసి విరాళం డీడీని అందజేశారు విజ్ఞాన్స్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య. విజ్ఞాన్స్ సంస్థ తరపున విరాళం అందజేసిన దాతను టీటీడీ ఛైర్మన్ అభినందించారు. మరోవైపు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి.. జనవరి 8 వరకు ఈ దర్శనాలు కొనసాగనున్నాయి.
శ్రీ కపిలేశ్వరస్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామివారు అభయమిచ్చారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ సుబ్రమణ్యస్వామివారు పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు అలపించారు.
తిరుమలలో స్వర్ణరథోత్సవం
తిరుమల వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుండి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ పర్వదినాన తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa