ఒంగోలు నగరపాలక సంస్థ ఒకేసారి 3 వేల మంది భవనాలు, ఇళ్ల యజమానులకు నోటీసులు జారీ చేసి సంచలనం సృష్టించింది. ఇంతకీ ఎందుకు ఈ నోటీసులు జారీ చేసిందంటే, వీరంతా అనధికారికంగా, అక్రమంగా భవనాలు, ఇళ్లు నిర్మించారు. అయితే వీటిని క్రమబద్ధీకరించుకోవడానికి నగరపాలక సంస్థ అవకాశం ఇచ్చినా, యజమానులు ముందుకు రాకపోవడంతో, వారికి నోటీసులు జారీ చేసి, రెడ్ మార్క్ వేసే చర్యలు చేపట్టింది. క్రమబద్ధీకరణకు ఈ సంవత్సరం, మార్చి 11 తుది గడువుగా నిర్ణయించినా, ఇప్పటివరకు కేవలం 534 దరఖాస్తులు మాత్రమే అందాయి.
వీటిలో 257 దరఖాస్తులకు పూర్తి రుసుము చెల్లించడంతో, అధికారులు వాటిని క్రమబద్ధీకరించారు. నగరంలో సుమారు 6 వేల అనధికారిక నిర్మాణాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వీరిలో సుమారు 3 వేల మందికి నోటీసులు పంపారు. గడువులోగా క్రమబద్ధీకరించుకోకపోతే చట్ట ప్రకారం కూల్చివేస్తామని ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమబద్ధీకరణ పథకం ద్వారా నగరపాలక సంస్థకు అపరాధ రుసుము రూపంలో సుమారు రూ.70 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ పథకం ద్వారా స్థానిక సంస్థలు ఆర్థికంగా బలపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత అక్రమ నిర్మాణాలు, భవనాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడంతో, పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని అధికారులు ఆశించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ఒంగోలు నగరంలో అనేక బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. ప్రభుత్వం క్రమబద్ధీకరణ కోసం ఈ పథకం అమలు చేస్తుందనే ఆలోచనతో చాలామంది నిబంధనలు పాటించకుండానే నిర్మాణాలు చేపట్టారు.
నగరంలోని రామనగర్, ముంగమూరు రోడ్డు, రాజీవ్నగర్, కొప్పోలు రోడ్డు వంటి ప్రాంతాల్లో జీ ప్లస్ త్రీ (G+3) కి మాత్రమే అనుమతి తీసుకుని, అనధికారికంగా అదనపు అంతస్తులు నిర్మించారు. ఇలాంటి భవనాలను అమ్మాలంటే, క్రమబద్ధీకరణ తప్పనిసరి. వ్యక్తిగత ఇళ్లు, వాణిజ్య సముదాయాల్లో ప్లాన్ నిబంధనలు పాటించని వారు, తేడాను బట్టి అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకంకు అర్హులైనవారు పెద్ద సంఖ్యలో ముందుకు రాకపోవడంతో, కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది నోటీసులు జారీ చేయడంతో పాటుగా, నిర్మాణాల ప్రహరీలపై ఎర్ర రంగుతో BPS నంబర్ వేసి హెచ్చరికలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, "సకాలంలో క్రమబద్ధీకరించుకోకుంటే చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. ఇదే నిబంధన లేఅవుట్ల క్రమబద్ధీకరణకు కూడా వర్తిస్తుందని వెల్లడించారు. గడువులోగా అక్రమ నిర్మాణాలు భవనాలను క్రమబద్ధీకరించుకోకపోతే, చట్ట ప్రకారం వాటిని కూల్చివేస్తామని నోటీసుల్లో స్పష్టంగా హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa