కుటుంబం అంటే పిల్లలకు ఒక రక్షణ కవచం. కానీ నేడు ఆ కవచమే కబళించే మృత్యువులా మారుతోంది. కృష్ణా జిల్లాలో కేవలం 45 రోజుల పసికందును ఓ తల్లి నీటిగుంటలో విసిరేసిన ఘటన మానవత్వాన్నే ప్రశ్నిస్తోంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అని కూడా చూడకుండా ఆ తల్లి చేసిన పని విని లోకం విస్తుపోతోంది. పాలు ఇచ్చి పెంచాల్సిన చేతులే కాలయముడి పాశంలా మారి పసి ప్రాణాన్ని గాలిలో కలిపేయడం అత్యంత విచారకరం.
మరోవైపు తండ్రుల క్రూరత్వం కూడా తక్కువగా ఏమీ లేదు. నారాయణపేట జిల్లాలో ఇద్దరు అమాయకపు పిల్లలను పొట్టనబెట్టుకున్న ఓ తండ్రి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు యత్నించడం గమనార్హం. చిన్నారి ప్రాణాలకు భద్రతగా నిలవాల్సిన తండ్రే కిరాతకుడిగా మారడం వెనుక ఉన్న సామాజిక, మానసిక కారణాలు ఆలోచింపజేస్తున్నాయి. పిల్లలు తమ సొత్తు అని, తమతో పాటే వారి జీవితాలు కూడా ముగిసిపోవాలని భావించే ఇలాంటి ధోరణి సమాజానికి పెను ముప్పుగా మారుతోంది.
రంగారెడ్డి జిల్లాలో జరిగిన తాజా ఘటనలో 11 నెలల పసికందుపై తల్లి విషప్రయోగం చేసి చంపేయడం హృదయ విదారకం. అత్తగారి సూటిపోటి మాటలు, భర్త వేధింపులు లేదా కుటుంబ కలహాలు.. కారణం ఏదైనా కావచ్చు, కానీ వీటికి ఏ పాపం తెలియని పసిబిడ్డలు ఎందుకు బలి కావాలనే ప్రశ్న ఉదయిస్తోంది. తన బాధకు బిడ్డను బలిపశువును చేయడం ఏ రకమైన న్యాయం? తల్లి ప్రేమను మించిన అమృతం లేదనే నమ్మకాన్ని ఇలాంటి ఘటనలు తుడిచిపెట్టేస్తున్నాయి.
వరుసగా జరుగుతున్న ఈ ఘోరాలు మనుషుల మధ్య నైతిక విలువలు, సహనం ఏ స్థాయిలో పడిపోతున్నాయో అద్దం పడుతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు పచ్చని సంసారాలను వల్లకాడుగా మారుస్తున్నాయి. కన్నబిడ్డలను చంపే స్థాయికి తల్లిదండ్రులు వెళ్తున్నారంటే, వారి మానసిక స్థితిని గమనించడంలో చుట్టుపక్కల వారు, సమాజం కూడా విఫలమవుతున్నట్టే లెక్క. కఠినమైన చట్టాలతో పాటు, మానసిక ధైర్యాన్ని ఇచ్చే కౌన్సిలింగ్ కేంద్రాలు ఇలాంటి విపత్తులను అడ్డుకోవడానికి ఎంతో అవసరం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa