ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు గాయం,,,,న్యూజిలాండ్‌తో ఫస్ట్ వన్డే ముందు టీమిండియాకు షాక్

sports |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 11:28 PM

ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ ముందు.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడనుంది టీమిండియా. ఈ నెల 11న న్యూజిలాండ్‌తో మొదలయ్యే మూడు వన్డేల సిరీస్‌ కోసం సెలక్టర్లు భారత జట్టును ఇటీవల ఎంపిక చేశారు. అయితే ఎంపికకు ముందు ఈ జట్టులో రిషబ్‌ పంత్‌ ఉంటాడా లేదా అన్నదానిపై సర్వత్రా చర్చ జరిగింది. ఎందుకంటే పంత్ టెస్టుల్లో మాత్రమే రెగ్యులర్‌ ప్లేయర్‌గా ఉన్నాడు. ఇక టీ20 జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఇక వన్డేల్లోకి కూడా వస్తూ.. పోతూ ఉన్నాడు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ రాణిస్తుండటంతో.. వన్డే జట్టులో పంత్‌ స్థానం ప్రశ్నార్థకమవుతోంది. ఈ నేపథ్యంలో తనను తాను నిరూపించుకునేందుకు రిషబ్ పంత్‌కు రాకరాక వచ్చినట్లుగా ఈ అవకాశం వచ్చింది. ఈ పరిస్థితుల్లో రిషబ్ పంత్‌కు మరో దెబ్బ పడింది. తాజాగా ఈ వికెట్ కీపర్- బ్యాటర్ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడినట్లు తెలుస్తోంది.


భారత్‌- న్యూజిలాండ్ మధ్య ఆదివారం (జనవరి 11) మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ వడోదరలోని బరోడా క్రికెట్ అసోషియేషన్ (బీసీఏ) స్టేడియంలో శ‌నివారం (జనవరి 10).. టీమిండియా జట్టు త‌మ చివ‌రి ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గోంది. ఈ క్రమంలో త్రోడౌన్ స్పెషలిస్టులను ఎదుర్కొంటుండగా.. బాల్ పంత్ నడుము పైభాగంలో బలంగా తగిలినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఈ సమాచారం ప్రకారం.. బాల్ తగిలాక రిషబ్ నొప్పితో విలవిల్లాడు. వెంటనే జట్టు ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చి అతడికి చికిత్స అందించినా నొప్పి తగ్గకలేదు. దీంతో రిషబ్ పంత్ ప్రాక్టీస్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


కాగా, ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో బిజీబీజీగా గడిపిన పంత్.. ఈ ప్రాక్టీస్ సెషన్‌కు ఒక రోజు ముందే భారత జట్టుతో చేరాడు. ఇంతలోనే అతడి గాయం కావడం గమనార్హం. అయితే రిషబ్ పంత్ ప్రాక్టీస్‌లో గాయపడిన సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, పంత్ గాయానికి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.


న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో సెలెక్ట్ అయినా.. పంత్‌ బెంచ్‌కే పరిమితం అవుతాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న తరుణంలో.. ఈ వికెట్ కీపర్ గాయపడటంతో ఆ వాదనలకు బలం చేకూరింది. ఒకవేళ గాయం నుంచి కోలుకున్నా.. అతడు బెంచ్‌కే పరిమితం అవుతాడని అంటున్నారు. కాగా, ఇటీవల సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో కూడా పంత్ మొత్తానికి బెంచ్‌కే ప‌రిమిత‌మ‌ం కావడం గమానార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa