కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీపేజీ) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గణనీయమైన స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో ఆదివారం తిరువనంతపురంలో కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన.. కొత్తగా ఎన్నికైన వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో కేరళలో కమలం గుర్తుపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యం అని చెప్పారు.
కాగా, బీజేపీ భవిష్యత్ ప్రణాళికలకు తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల విజయం ఒక మెట్టు లాంటిదని అభివర్ణించారు అమిత్ షా. "ఈ విజయం మా లక్ష్యం కాదు. మా లక్ష్యాన్ని సాధించే దిశగా ఇదొక మెట్టు మాత్రమే. కేరళలో కమలం గుర్తుపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. బీజేపీ ముఖ్యమంత్రిని తీసుకురావడమే మా అంతిమ లక్ష్యం. కేరళను సంపూర్ణంగా అభివృద్ధి చేయడం.. దేశ వ్యతిరేక శక్తుల నుంచి కేరళను రక్షించడం.. శతాబ్దాలుగా కేరళలో ఉన్న విశ్వాసాన్ని కాపాడటమే మా లక్ష్యం" అని షా అన్నారు.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో అధికారంలో ఉన్న సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్)కు పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది. ఎందుకంటే ఇది తిరువనంతపురం కార్పొరేషన్లో.. ఆ కూటమి 45 ఏళ్ల పాలనకు ముగింపు పలికింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు కనుమరుగవుతున్నారని.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభవం కోల్పోతోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, కమ్యూనిస్టుల ఎల్డీఎఫ్ మధ్య ఉన్న 'మ్యాచ్ ఫిక్సింగ్' కారణంగానే.. కేరళలో అభివృద్ధి మందగించిందని అమిత్ షాక్ ఎద్దేవా చేశారు. ప్రజలకు స్పష్టమైన విజన్.. వినయంతో సేవ చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు.
"2047 నాటికి ప్రధాని మోదీ కలలు కంటున్న 'వికసిత్ భారత్' సాధనలో కేరళ అభివృద్ధి అత్యంత కీలకం. అది కేవలం ఎన్డీయేతోనే సాధ్యం అవుతుంది. రాష్ట్ర భద్రతను, శతాబ్దాలుగా వస్తున్న ప్రజల విశ్వాసాలను కాపాడే సత్తా ఎన్డీయేకే ఉంది" అని అమిత్ షా అన్నారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్లోని 101 వార్డులకు గాను ఎన్డీయే ఏకంగా 50 వార్డులను కైవసం చేసుకుని అతిపెద్ద కూటమిగా అవతరించింది. అధికార ఎల్డీఎఫ్ను 29 స్థానాలకే కట్టడి చేసింది. మెజారిటీకి ఒక స్థానం తక్కువ వచ్చినా.. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa