ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లికి నో చెప్పిందని ప్రియురాలి బిడ్డను కిడ్నాప్ చేసిన యువకుడు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 11, 2026, 07:31 PM

ప్రేమ కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం, అబ్బాయి కోసం ఎంతకైనా తెగిస్తుంటారు చాలా మంది. ప్రాణాలు తీసుకోవడం దగ్గరి నుంచి ప్రాణాలు తీయడం వరకు ఏదైనా చేస్తారు. కానీ మనం ఇప్పుడు చూడబోయే కథలో మాత్రం ఓ ప్రేమికుడు ఎవరూ ఊహించని పని చేశాడు. ప్రియురాలు తనతో పెళ్లికి ఒప్పుకోలేదని.. ఏకంగా ఆమె కన్నకొడుకును కిడ్నాప్ చేశాడు. ఆపై ఢిల్లీ నుంచి బీహార్‌కు రైలులో పారిపోతుండగా పోలీసులు సినిమా ఫక్కీలో ఛేజ్ చేసి నిందితుడిని కాన్పూర్‌లో అరెస్ట్ చేశారు.


అసలేం జరిగిందంటే..?


బీహార్‌కు చెందిన హేమంత్ కుమార్, ఢిల్లీలోని కపాషెరా ప్రాంతంలో నివసించే ఒక మహిళతో ప్రేమలో పడ్డాడు. హేమంత్ ఆమెను పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం బీహార్ నుంచి ఢిల్లీకి వచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరాడు. అయితే సదరు మహిళ తనకు ఇప్పటికే పెళ్లయిందని.. ఏడాది వయసున్న బాబు ఉన్నాడని, కాబట్టి పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని తెగేసి చెప్పింది.


ప్రియురాలి సమాధానంతో హేమంత్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తమ పెళ్లికి ఆ చిన్నారే అడ్డుగా ఉన్నాడని భావించాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. బాబుకు బొమ్మలు కొనిస్తానని నమ్మించి కిడ్నాప్ చేశాడు. ఆపై నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లి బీహార్ వెళ్లే విక్రమశిల ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్ ఎక్కేశాడు. రైలులో బాబు ఏడుస్తుంటే.. తల్లికి ఒంట్లో బాలేదని, బీహార్‌లో ఉన్న నానమ్మ దగ్గరకు తీసుకెళ్తున్నానని తోటి ప్రయాణికులను నమ్మించాడు.


పెళ్లి చేసుకుంటేనే బిడ్డను ఇస్తానంటూ బెదిరింపులు..


ఇంటి దగ్గర బాబు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి.. హేమంత్‌కు ఫోన్ చేసింది. ఈక్రమంలోనే అతడు "నువ్వు నాతో రావడానికి ఇష్టపడలేదు.. అందుకే నీ బిడ్డను తీసుకెళ్తున్నాను. నీ బిడ్డ నీకు తిరిగి కావాలంటే బీహార్ వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి" అంటూ హేమంత్ ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో దిక్కుతోచని ఆ తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించింది.


ఢిల్లీ పోలీసులు వెంటనే అప్రమత్తమై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు సమాచారం అందించారు. నిందితుడు విక్రమశిల ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నాడని తెలియడంతో కాన్పూర్ సెంట్రల్ స్టేషన్ అధికారులను అలర్ట్ చేశారు. రాత్రి 8.10 గంటలకు రైలు కాన్పూర్ చేరుకోగానే.. పోలీసులు జనరల్ కోచ్‌ను చుట్టుముట్టారు. పోలీసులను చూసి తప్పించుకోవాలని చూసిన హేమంత్‌ను వెంబడించి పట్టుకున్నారు. మొదట ఆ బాబు తన కొడుకే అని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా.. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం ఒప్పుకున్నాడు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉన్నాడు. ఢిల్లీ పోలీసులు కాన్పూర్ చేరుకుని నిందితుడిని, బాబును ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa