ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"1947లో మీరంతా ఎక్కడ ఉన్నారు?": ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్రపై అసదుద్దీన్ ఒవైసీ

national |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 08:30 PM

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీలపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్రను ప్రశ్నిస్తూనే.. ముస్లింల దేశభక్తిపై వస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.


హెడ్గేవార్ జైలుకెళ్లింది 'ఖిలాఫత్' కోసమే..!


"మాకు దేశభక్తి పాఠాలు నేర్పిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ నేతల్లో ఒక్కరైనా బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారా?" అని ఒవైసీ ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కె.బి. హెడ్గేవార్ జైలుకు వెళ్లిన మాట వాస్తవమేనని.. కానీ అది బ్రిటీష్ పాలనను వ్యతిరేకించినందుకు కాదని, ముస్లింలు చేపట్టిన ఖిలాఫత్ ఉద్యమం (1919-1924)కు మద్దతుగా వెళ్లారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. "బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఒక్కడైనా ఉన్నారా?" అని ఆయన నిలదీశారు. 'క్విట్ ఇండియా', 'సైమన్ గో బ్యాక్' వంటి చారిత్రాత్మక నినాదాలను ఇచ్చింది ముంబైకి చెందిన సోషలిస్ట్ నాయకుడు యూసుఫ్ మెహర్ అలీ అని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తు చేశారు.


  అలాగే ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఉన్నారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఒకవేళ బంగ్లాదేశీయులు నిజంగానే ఇక్కడ ఉంటే.. అది మోదీ ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన మండిపడ్డారు. "అధికారంలో ఉన్నది మీరే. సరిహద్దులు మీ ఆధీనంలో ఉన్నాయి. ఇంటెలిజెన్స్ మీదే.. అయినా 10 కిలో మీటర్ల మేర కంచె వేయడం చేతకాదు కానీ.. ఇక్కడ బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ అంటూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నారు" అని విమర్శించారు. చైనా, ఐఎస్ఐ (ISI) ఏజెంట్లు బంగ్లాదేశ్‌కు చేరుకున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.


గడ్డం ఛాలెంజ్..


ఈ సభలో మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం తుడిచి పెట్టుకుపోతుందన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్యలకు ఆయన సవాల్ విసిరారు. "ఒకవేళ ఈ ఎన్నికల్లో ఎంఐఎం ఓడిపోతే నేను నా గడ్డం గీసుకుంటాను. కానీ అది జరగకపోతే.. మీరు రేజర్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి" అంటూ షిండేకు గట్టి సవాల్ విసిరారు.


పౌరసత్వాన్ని ప్రశ్నించే అధికారం హోం శాఖకు ఉన్నప్పటికీ.. ఆ బాధ్యతలను ఎన్నికల సంఘానికి అప్పగించడం ద్వారా మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఒవైసీ ఆరోపించారు. జనవరి 15న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమ ఉనికిని చాటుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa