ఇరాన్లో కొనసాగుతున్న అంతర్గత కల్లోలం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీస్తోంది. ఇరాన్ ప్రభుత్వం తన పౌరులపై సాగిస్తున్న ఉక్కుపాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కలిగిన ఏ దేశమైనా సరే.. అమెరికాతో చేసే వ్యాపారంపై 25 శాతం అదనపు సుంకం చెల్లించాల్సిందేనని ఆయన హుకూం జారీ చేశారు. సోమవారం 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
ఈ నిర్ణయం ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములైన భారత్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), టర్కీలపై భారీ ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా భారత్ విషయానికొస్తే.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఇరాన్ మధ్య దాదాపు రూ. 15,000 కోట్ల (1.68 బిలియన్ డాలర్ల) వ్యాపారం జరిగింది. బాస్మతీ బియ్యం, ఆర్గానిక్ కెమికల్స్, పండ్లు, టీ వంటివి భారత్ నుంచి ఇరాన్కు వెళ్తున్నాయి. కేవలం బియ్యం ఎగుమతులే సుమారు 750 మిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా 50 శాతం వరకు సుంకాలు విధించింది. ఇప్పుడు ఇరాన్ కారణంగా మరో 25 శాతం భారం పడితే.. అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి.
సైనిక చర్యకు సిద్ధమా?
కేవలం ఆర్థిక ఆంక్షలతోనే సరిపెట్టకుండా.. ఇరాన్పై సైనిక దాడులు చేసేందుకు కూడా ట్రంప్ వెనకాడటం లేదు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. "వైమానిక దాడులు మాకున్న అనేక ఆప్షన్లలో ఒకటి" అని స్పష్టం చేశారు. అయితే తెరవెనుక ఇరాన్ అధికారులు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బయట కనిపిస్తున్న దూకుడుకు భిన్నంగా.. ప్రైవేట్ చర్చల్లో ఇరాన్ మెత్తబడినట్లు వైట్ హౌస్ వర్గాల సమాచారం.
ట్రంప్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాల చట్టబద్ధతపై అమెరికా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. దేశాధినేతకు ఇలా దేశాలపై నేరుగా సుంకాలు విధించే అధికారం ఉందా? లేదా? అనే అంశంపై బుధవారం (జనవరి 14) వెలువడే తీర్పు అత్యంత కీలకం కాగా.. అంతా ఆ తీర్పు గురించి వేచి చూస్తున్నారు. ఒకవేళ కోర్టు ట్రంప్నకు వ్యతిరేకంగా తీర్పును ఇస్తే.. ఈ 25 శాతం టారిఫ్ అమలు నిలిచిపోయే అవకాశం ఉంది. మొత్తానికి ఇరాన్ నిరసనకారులకు మద్దతుగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరాన్ను ఒంటరి చేస్తుందా? లేక అమెరికా మిత్రదేశాలతోనే దౌత్యపరమైన చిక్కులు తెచ్చిపెడుతుందా? అన్నది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa