ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు చేసింది. రాష్ట్రంలో బార్లపై ఇప్పటివరకు విధింపబడుతున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ను రద్దు చేశారు. దీని ద్వారా మద్యం ఏ షాపు లేదా బార్ల నుండి కొనుగోలు చేసినా ఒకే రేటులో అందించబడుతుంది.ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా ఈ మేరకు ముఖ్య ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నవంబర్ నుంచి అమల్లో ఉన్న ప్రత్యేక అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ను తొలగిస్తూ జీఎంఎస్ నంబర్ 24ని మంగళవారం జారీ చేశారు. ఈ నిర్ణయం బార్ల వ్యాపారులకు పెద్ద ఊరట కలిగిస్తుంది.ఇకపై రిటైల్ షాపులు, బార్ల మధ్య ధరల్లో తేడా ఉండదు. ధరల్లో సమానత్వం తీసుకురావడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం అని అధికారులు పేర్కొన్నారు. ఏపీఎస్బీసీఎల్ డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్పై అదనపు పన్నులు ఇకపై విధించబడవు.అదనంగా, ఎక్సైజ్ చట్టాల ప్రకారం కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని, 2025 బార్ లైసెన్స్ నిబంధనల్లో అవసరమైన సవరణలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త మార్పులు అమలుకు డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్, డిస్టిలరీస్ కమిషనర్, ఏపీఎస్బీసీఎల్ అధికారులు బాధ్యత వహిస్తారు.ఈ నిర్ణయం జనవరి 13 నుండి అమల్లోకి వస్తుంది. గతంలో రిటైల్ షాపుల కంటే బార్లకు మద్యం ఎక్కువ ధరకు సరఫరా కావడం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. కొత్త మార్పులతో ఖర్చులు తగ్గి, బార్లకు పెద్ద ఊరట లభించిందని వ్యాపారులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa