ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కమిటీతో మాకు సంబంధం లేదు: ట్రంప్‌ కు నార్వే ప్రధాని క్లారిటీ

international |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 11:14 PM

అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక వింత వాదనను తెరపైకి తెచ్చారు. తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడానికి, గ్రీన్‌ల్యాండ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకోవాలనే పట్టుదలకు మధ్య సంబంధం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తాను 8 యుద్ధాలు ఆపానని, అయినా తనకు నోబెల్ పురస్కారం ఇవ్వకూడదని నార్వే నిర్ణయించిందని చెప్పారు. కాబట్టి ఇక శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం తనకు లేదని.. అందుకే అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా ఈ కామెంట్లపై నార్వే ప్రధాన మంత్రి స్పందించారు. నోబెల్ బహుమతులు ఇచ్చేది తాము కాదని స్పష్టం చేశారు. అలాగే ట్రంప్‌నకు పూర్తి క్లారిటీ ఇస్తూ.. మరిన్ని విషయాలను వెల్లడించారు.


అసలేం జరిగిందంటే..?


ఐరోపా దేశాలపై ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన భారీ సుంకాల పెంపును వ్యతిరేకిస్తూ నార్వే ప్రధాని స్టోర్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సంయుక్తంగా ట్రంప్‌నకు ఒక సందేశం పంపారు. దీనికి బదులిస్తూ ట్రంప్ పంపిన మెసేజ్ ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. "సుమారు ఎనిమిది యుద్ధాలను ఆపిన నాకు మీ దేశం (నార్వే) నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. అందుకే ఇకపై కేవలం శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన బాధ్యత నాకు లేదు. ఇప్పుడు అమెరికా ప్రయోజనాలే నాకు ముఖ్యం. అందుకే గ్రీన్‌ల్యాండ్‌ను దక్కించుకోవడంపై దృష్టి పెట్టాను" అని ట్రంప్ పేర్కొన్నారు.ఇదీ చూడండి: ట్రంప్ శాంతి బోర్డులో చేరాలంటే రూ. 9 వేల కోట్లు కట్టాల్సిందే.. భారత్, పాకిస్థాన్‌లకు భారీ ఆఫర్ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఇదే..!


 'అది మా చేతుల్లో లేదు': నార్వే ప్రధాని క్లారిటీ


ట్రంప్ వ్యాఖ్యలపై నార్వే ప్రధాని స్టోర్ స్పందిస్తూ.. నోబెల్ శాంతి బహుమతికి, నార్వే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని ట్రంప్‌కు స్పష్టంగా వివరించినట్లు తెలిపారు. "నోబెల్ బహుమతులను ఒక స్వతంత్ర కమిటీ నిర్ణయిస్తుంది తప్ప ప్రభుత్వం కాదు. ఈ విషయాన్ని నేను అధ్యక్షుడు ట్రంప్‌కు స్పష్టంగా రాశాను" అని స్టోర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్ దేశానికి ఉన్న హక్కులను కూడా ట్రంప్ ప్రశ్నించారు. "వందల ఏళ్ల క్రితం ఒక పడవ అక్కడ ఆగింది కాబట్టి అది వారిదైపోదు.. మన పడవలు కూడా అక్కడ ఆగాయి" అని ఆయన వింత తర్కాన్ని వినిపించారు. నాటో వ్యవస్థ స్థాపించినప్పటి నుంచి ఏ వ్యక్తి చేయనంత సేవ తాను చేశానని, ఇప్పుడు నాటో అమెరికా కోసం ఏదో ఒకటి చేయాలని, గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉంటేనే ప్రపంచం సురక్షితంగా ఉంటుందని ట్రంప్ వాదించారు. వైట్ హౌస్ కూడా అధ్యక్షుడి వ్యాఖ్యలను సమర్థిస్తోంది. గ్రీన్‌ల్యాండ్ భౌగోళికంగా అమెరికా జాతీయ భద్రతకు అత్యంత కీలకమని, ఆర్కిటిక్ ప్రాంతంలోని ఆధునిక ముప్పుల నుండి గ్రీన్‌ల్యాండ్ ప్రజలను అమెరికా మాత్రమే రక్షించగలదని వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa