భారత క్రికెట్లో కీలక మార్పులకు బీజం పడినట్టుగా కనిపిస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ, బీసీసీఐకి కేంద్ర కాంట్రాక్టుల విషయంలో సంచలన ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఏ + కేటగిరీని పూర్తిగా తొలగించాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారని వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ ఆమోదం లభిస్తే, ఇకపై భారత క్రికెట్లో కేవలం ఏ, బీ, సీ అనే మూడు కేటగిరీలే కొనసాగనున్నాయి.
ప్రస్తుతం ఏ+ గ్రేడ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ , జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. అయితే ఈ నలుగురిలో అన్ని ఫార్మాట్లలో కొనసాగుతున్న ఏకైక ఆటగాడు బుమ్రానే కావడం గమనార్హం. జడేజా ఇప్పటికే టీ20లకు గుడ్బై చెప్పగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులు, టీ20ల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ+ కేటగిరీ కొనసాగించాల్సిన అవసరం లేదని సెలెక్షన్ కమిటీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఏ+ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్లు చెల్లిస్తున్నారు. ఈ గ్రేడ్ తొలగితే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లు తక్కువ కేటగిరీకి దిగజారే అవకాశాలు ఉన్నాయి. అలా జరిగితే వారి వార్షిక కాంట్రాక్ట్ విలువ కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఏ కేటగిరీలో రూ.5 కోట్లు, బీ కేటగిరీలో రూ.3 కోట్లు, సీ కేటగిరీలో రూ.1 కోటి మాత్రమే చెల్లిస్తారు.
వచ్చే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో కొన్ని కీలక మార్పులు కూడా చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా జట్టుకు దూరంగా ఉన్న మొహమ్మద్ షమీ తన కేంద్ర కాంట్రాక్టును కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు, అర్ష్దీప్ సింగ్కి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అతడు సి కేటగిరీ నుంచి బీ కేటగిరీకి ఎగబాకవచ్చని సమాచారం. అలాగే వైట్బాల్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న హర్షిత్ రాణాకు కూడా మెరుగైన గ్రేడ్ దక్కే ఛాన్స్ ఉంది.
అత్యున్నత కేటగిరీలో కొనసాగేది ప్రధానంగా మూడు ఫార్మాట్లలో యాక్టివ్గా ఉన్న ఆటగాళ్లేనని సెలెక్టర్లు స్పష్టంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా టాప్ బ్రాకెట్లో కచ్చితంగా కొనసాగుతాడని అంచనా. అలాగే భారత క్రికెట్కు ముఖచిత్రంగా మారుతున్న శుభ్మన్ గిల్కు కూడా అత్యున్నత కేటగిరీ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మార్పులు అమలులోకి వస్తే, భారత క్రికెట్లో సెంట్రల్ కాంట్రాక్టుల వ్యవస్థలో ఇది అతిపెద్ద మార్పుగా నిలవనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa