బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) 2026లో పాకిస్తాన్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా చేసిన ప్రయత్నం నెట్టింట ట్రోలింగ్కు దారితీసింది. రవి శాస్త్రి స్టయిల్లో ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు ఆయన చేసిన మేక్ సమ్ నాయిస్ పిలుపునకు స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రమీజ్ రాజా తీవ్ర ట్రోలింగ్కు గురయ్యాడు.
ప్రస్తుతం బీపీఎల్లో కామంటేటర్ చేస్తున్న రమీజ్ రాజాకు మిర్పూర్లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో టాస్ నిర్వహించే బాధ్యత అప్పగించారు. టాస్కు ముందు వాతావరణాన్ని వేడెక్కించేందుకు ఆయన “ఢాకా.. ఆర్ యూ రెడీ టు బౌన్స్ అండ్ మేక్ సమ్ నాయిస్?” అంటూ రవి శాస్త్రి తరహాలో స్టార్ట్ చేశాడు. కానీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. స్టేడియం పూర్తిగా నిశ్శబ్దంగా ఉండటంతో నిరాశ చెందిన రమీజ్ “వాళ్లకు నాయిస్ చేయాలనిపించడం లేదు” అంటూ టాస్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ దృశ్యాన్ని గమనించిన అభిమానులు రవి శాస్త్రి తరహాలో స్టార్ట్ చేసినా, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో రమీజ్ పూర్తిగా విఫలమయ్యాడంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఈ వీడియోకు మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తాయి.
క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రమీజ్ రాజా కామంటేటర్గా, విశ్లేషకుడిగా మంచి గుర్తింపు సంపాదించారు. పాకిస్తాన్ తరఫున 1984 నుంచి 1997 వరకు 13 ఏళ్ల కెరీర్లో 57 టెస్టులు, 198 వన్డేలు ఆడిన ఆయన, 1992 ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. బీపీఎల్ జరుగుతున్న సమయంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ మరో పెద్ద వివాదంలో చిక్కుకుంది. టీ20 వరల్డ్ కప్ కోసం భారత్కు వెళ్లేందుకు భద్రతా కారణాలు చూపుతూ, తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఐసీసీని కోరింది. అయితే ఐసీసీ ఇప్పటివరకు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ను టోర్నమెంట్ నుంచి తప్పిస్తే, పాకిస్తాన్ కూడా టీ20 వరల్డ్ కప్ను బహిష్కరించే అవకాశం ఉందని పాకిస్తాన్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ క్రికెట్లో మరింత చర్చకు దారితీశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa