భారతదేశంలోనే అత్యంత విలాసవంతమైన పర్యాటక రైలు అయిన మహారాజా ఎక్స్ప్రెస్ను బోల్తా కొట్టించేందుకు జరిగిన కుట్రను లోకో పైలట్ చాకచక్యం తప్పించింది. లోకో పైలట్ సమయస్ఫూర్తి అందులో ప్రయాణిస్తున్న విదేశీ పర్యాటకుల ప్రాణాలను కాపాడింది. రాజస్థాన్లోని జైపుర్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జైపుర్ నుంచి సవాయి మాధోపుర్కు వందల మంది విదేశీ పర్యాటకులతో వెళ్తున్న మహారాజా ఎక్స్ప్రెస్ లక్ష్యంగా దుండగులు ఈ విధ్వంసానికి ప్రణాళిక రచించారు.
మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో శివదాస్పురా ప్రాంతంలోని మహాత్మా గాంధీ ఆస్పత్రి సమీపంలో పట్టాలపై 5 అడుగుల పొడవు ఉన్న ఇనుప రాడ్లను ఉంచారు. అర్ధరాత్రి చీకట్లో కూడా రైలు పట్టాలపై ఉన్న ఇనుప రాడ్లను చూసిన లోకో పైలట్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ బ్రేక్లు వేశారు. దీంతో రైలు భారీ కుదుపుతో పట్టాలపైనే వెంటనే ఆగిపోయింది. ఒకవేళ లోకో పైలట్ ఆ ఐరన్ రాడ్లను గుర్తించకపోయి ఉంటే.. మహారాజా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్).. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. అయితే దుండగులు ఉద్దేశపూర్వకంగానే 5 అడుగుల పొడవు ఉన్న 6 ఇనుప రాడ్లను పట్టాలపై అమర్చినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే గత కొన్ని నెలలుగా రాజస్థాన్లో ఇలాంటి ఘటనలు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతంలో అజ్మీర్, సిరోహి జిల్లాల్లో కూడా రైళ్లను పట్టాలు తప్పించేందుకు.. వాటిపై ఇనుప రాడ్లు, సిలిండర్లు, ఇతర వస్తువులు ఉంచిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలాగే వందే భారత్ వంటి అత్యాధునిక రైళ్లపై రాళ్ల దాడులు కూడా అక్కడక్కడా జరుగుతుండటం తీవ్ర సంచలనంగా మారుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa