దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ థాని బిన్ అహ్మద్ అల్ జయేదీతో బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ, పలు కీలక రంగాల్లో భాగస్వామ్యం కావాలని యూఏఈని ఆహ్వానించారు. ఈ భేటీలో ప్రధానంగా ఏపీలో 'దుబాయ్ ఫుడ్ క్లస్టర్' ఏర్పాటు ప్రతిపాదనపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.ఈ సమావేశంలో అగ్రిటెక్, ఫుడ్ టెక్, ఆక్వా టెక్నాలజీలతో పాటు ఫుడ్ పార్కుల అభివృద్ధి, ఆహార భద్రత వంటి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ, ఆక్వా, ఉద్యాన ఉత్పత్తులు అధికంగా ఉన్నాయని, వాటిని ప్రాసెస్ చేసి అంతర్జాతీయ మార్కెట్లకు తరలించేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఆహార ఉత్పత్తులను వేగంగా, సులభంగా రవాణా చేయడానికి అవసరమైన పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్డు, రైలు మార్గాలతో కూడిన పటిష్టమైన నెట్వర్క్ ఏపీలో ఉందని తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రం గుండా వెళ్తున్న జాతీయ పారిశ్రామిక కారిడార్లు లాజిస్టిక్స్కు మరింత ఊతమిస్తాయని యూఏఈ మంత్రికి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa