మినీ బ్రహ్మోత్సవంగా భావించే రథసప్తమి వేడుకలకు తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జనవరి 25న జరగనున్న ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. వేడుకల రోజున అన్ని రకాల ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.రథసప్తమి సందర్భంగా ఒకే రోజులో శ్రీ మలయప్ప స్వామి వారు ఎనిమిది వాహనాలపై మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో సేవలు ప్రారంభమై, రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి. ఈ వేడుకలను వీక్షించేందుకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పటిష్ఠమైన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జనవరి 24 నుంచి 26 వరకు తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని కూడా నిలిపివేశారు.భక్తుల సౌకర్యార్థం 85 కౌంటర్ల ద్వారా 14 రకాల అన్నప్రసాదాలను పంపిణీ చేయనున్నారు. భద్రత కోసం 1300 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందిని మోహరించారు. భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ 2300 ప్రత్యేక ట్రిప్పులు నడపనుండగా, మెరుగైన పారిశుద్ధ్య చర్యలు, వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. ఈ వేడుకలను 1000 మంది కళాకారులతో 56 రకాల కళారూపాల ప్రదర్శనలతో మరింత శోభాయమానంగా మార్చనున్నారు. ఈ ఉత్సవాలను ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa