ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో తమ దేశానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించడంపై ఇరాన్ హర్షం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు భారత్లోని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలీ శనివారం ప్రకటించారు. ఇది అన్యాయమైన, రాజకీయ ప్రేరేపిత తీర్మానమని, దీనిని వ్యతిరేకించడం ద్వారా భారత్ న్యాయం, బహుపాక్షికత, జాతీయ సార్వభౌమత్వానికి కట్టుబడి ఉందని చాటిందని ఆయన ప్రశంసించారు.శుక్రవారం జరిగిన UNHRC 39వ ప్రత్యేక సమావేశంలో ఇరాన్కు వ్యతిరేకంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గతేడాది డిసెంబర్ 28 నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఇరాన్ ప్రభుత్వం హింసాత్మకంగా అణచివేయడాన్ని ఈ తీర్మానం తీవ్రంగా ఖండించింది. ఈ అణచివేతలో వేలాది మంది పౌరులు, చిన్నారులు మరణించారని, అనేకమంది గాయపడ్డారని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 25 దేశాలు, వ్యతిరేకంగా 7 దేశాలు ఓటు వేయగా, 14 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి.ఈ తీర్మానం ద్వారా ఇరాన్పై స్వతంత్ర అంతర్జాతీయ నిజనిర్ధారణ కమిటీ పదవీ కాలాన్ని రెండేళ్లు, మానవ హక్కుల పరిస్థితులపై ప్రత్యేక ప్రతినిధి పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. నిరసనల అణచివేతపై తక్షణమే దర్యాప్తు జరపాలని, చట్టవిరుద్ధ హత్యలు, చిత్రహింసలు, అక్రమ అరెస్టులను ఆపాలని ఇరాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.ఈ పరిణామాల నేపథ్యంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో ఫోన్లో మాట్లాడారు. మరోవైపు, ఇరాన్లోని పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లవద్దని భారత ప్రభుత్వం తన పౌరులకు మరోసారి గట్టిగా సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇరాన్కు ప్రయాణాలు మానుకోవాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa