తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక బిల్లును.. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం కల్పించింది. ప్రైవేటు స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం తమిళనాడు ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చి తల్లిదండ్రులకు భారీ ఉపశమనం కల్పించింది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించే ఫీజులే 3 ఏళ్ల పాటు అమలులో ఉంటాయని చట్టంలో పొందుపరిచింది. ఈ కమిటీలో మొదటిసారిగా తల్లిదండ్రుల ప్రతినిధికి చోటు కల్పించడం విశేషం. అడ్డగోలుగా ప్రైవేటు స్కూళ్లు ఫీజులు పెంచడాన్ని అరికడుతూ.. పారదర్శకమైన విద్యా వ్యవస్థను తీసుకురావడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ.. గతంలో ఉన్న చట్టానికి కీలక సవరణలు చేసిన స్టాలిన్ సర్కార్.. తమిళనాడు పాఠశాలల (ఫీజు నియంత్రణ) సవరణ బిల్లు-2026కు అసెంబ్లీ వేదికగా సోమవారం ఏకగ్రీవంగా ఆమోదం కల్పించింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. ఇకపై ప్రైవేటు పాఠశాలలు తమ ఇష్టానుసారంగా ఫీజులు పెంచడానికి వీలుండదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల కమిటీ.. ప్రతి పాఠశాల మౌలిక సదుపాయాలు, ఖర్చులను బట్టి ఫీజులను నిర్ణయిస్తుంది. ఈ ఫీజులు 3 అకడమిక్ సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి.
2009 నాటి పాత చట్టంలో ఫీజుల నిర్ణయంలో తల్లిదండ్రులకు భాగస్వామ్యం లేదు. కానీ కొత్త సవరణ ప్రకారం.. రాష్ట్ర తల్లిదండ్రుల ఉపాధ్యాయ సంఘం నుంచి ఒక ప్రతినిధిని కమిటీలో సభ్యునిగా చేర్చారు. గతంలో కమిటీ నిర్ణయించిన ఫీజులపై అభ్యంతరాలు తెలపడానికి 15 రోజుల సమయం ఉండేది. ఇప్పుడు ఆ గడువును 30 రోజులకు పెంచారు.
కమిటీలో సభ్యులు
రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ఈ కమిటీలో పాఠశాల విద్య డైరెక్టర్, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధి, ప్రాథమిక విద్య ప్రతినిధి, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ జాయింట్ చీఫ్ ఇంజనీర్, విద్యాశాఖ ఉన్నతాధికారి వంటి ఏడుగురు సభ్యులుగా ఉంటారు. త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఈ చట్టం డీఎంకేకు కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa