గత కొన్నేళ్లుగా వివాహ బంధాలకు అర్థం లేకుండా పోతోంది. మూడు ముళ్లు, ఏడు అడుగులు వేసి.. పవిత్ర బంధంలోకి అడుగు పెట్టి.. జీవితాంతం ఒకరికి ఒకరం కలిసి ఉంటామని ప్రమాణం చేసినా.. భార్యాభర్తలు విడిపోతున్నారు. అయితే పెళ్లి బంధంలో ఉండగానే.. ఇంకొకరిపై మోజుతో.. కట్టుకున్న వారిని, పిల్లలను కూడా వదిలేసి.. లవర్తో వెళ్లిపోతున్నారు. ఇలా భర్తలను వదిలేసిన భార్యలు.. భార్యలను వదిలేసిన భర్తలు.. వెళ్లిపోతున్న ఘటనలు పెరిగిపోవడం ప్రస్తుతం సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అలా కట్టుకున్న వారిని వదిలేసి వెళ్లి.. ప్రేమ పేరుతో చేసే మోసాలకు బలై చాలా మంది ప్రాణాలు తీసుకోవడం.. మరికొంతమంది అవస్థలు పడటం చూస్తూనే ఉన్నాం.
తాజాగా బిహార్లో జరిగిన ఓ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. పెళ్లి అయి కొడుకు ఉన్నప్పటికీ.. ఓ మహిళ భర్త, కుమారుడిని వదిలేసి.. లవర్ కోసం వెళ్లిపోయింది. అయితే అతడు మోసం చేయడంతో.. వ్యభిచార కూపంలో చిక్కుకుంది. కొన్ని నెలల పాటు అక్కడ అవస్థలు పడి.. ఎట్టకేలకు తన భర్తకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆమెను రక్షించి.. తిరిగి భర్త వద్దకు చేర్చారు. పాట్నాకు చెందిన మహిళకు 4 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
భర్తతో విభేదాల కారణంగా ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో సోషల్ మీడియా ద్వారా ఒక యువకుడితో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి.. అతని కోసం తన ఇంటిని, కుమారుడిని వదిలి పాట్నా రైల్వే జంక్షన్కు చేరుకుంది. అయితే.. ఆమెను అక్కడికి పిలిపించిన ప్రియుడు మాత్రం.. అక్కడికి రాకపోవడంతో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది.
ఉద్యోగం ఆశ చూపి వ్యభిచార కూపంలోకి..!
అక్కడే పరిచయమైన మరో వ్యక్తి.. ఆ మహిళకు పశ్చిమ బెంగాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి కారులో తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్నాక.. ఒక ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రూ.2 లక్షలకు ఒక వ్యభిచార గృహానికి తనను ఆ వ్యక్తి అమ్మేసినట్లు తెలిసి.. షాక్ అయింది. గత 8 నెలలుగా ఆమె ఆ వ్యభిచార కూపంలో బందీగా ఉండి.. ప్రతిరోజూ నరకాన్ని అనుభవించింది.
కస్టమర్ సాహసం
ఇక ఆ వ్యభిచార గృహంలోకి వెళ్లిన తర్వాత బయటపడేందుకు నిత్యం తన వద్దకు వచ్చే ఎంతోమంది కస్టమర్లను ఆమె సాయం కోరినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. ఒక కస్టమర్ ఆమె దీనగాథను విని చలించిపోయాడు. అక్టోబర్ 2వ తేదీన అతను రహస్యంగా ఆమె భర్తకు వీడియో కాల్ చేసి.. ఆమె ఉన్న ప్రదేశం గురించి సమాచారం అందించాడు. ఆ వీడియో కాల్లో.. 'ఇక్కడ ప్రతిరోజూ నాపై అత్యాచారం చేస్తున్నారు.. దయచేసి నన్ను కాపాడండి" అని ఆమె తన భర్తను వేడుకుంది.
పోలీసుల రక్షణ
ఆ వీడియో కాల్ తర్వాత ఆమె భర్త వెంటనే బిహార్ పోలీసులను ఆశ్రయించి.. జరిగిన విషయం చెప్పాడు. పశ్చిమ బెంగాల్లోని ఇస్లాంపూర్ పోలీసుల సహకారంతో ఆ ప్రాంతంపై దాడి చేసి ఆమెను రక్షించారు. ప్రస్తుతం ఆమె సురక్షితంగా పాట్నాలోని తన కుటుంబం వద్దకు చేరుకుంది. దీంతో ఈ కథ సుఖాంతం అయింది. ఇలా సోషల్ మీడియాలో ప్రేమ పేరుతో ట్రాప్ చేసే వారి వలలో పడొద్దని పోలీసులు హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa